సీఎం రేవంత్ పాలనకు 1,000 రోజులు - సంక్షేమంతో పాటు అభివృద్ధి.. మహిళలకు పెద్దపీట!
CM Revanth Reddy 1000 Days Rule : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 1వ తేదీకి ఈ మైలురాయికి చేరుకుంటుంది. రూ.2 లక్షల వ్యవసాయ రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు కీలక నిర్ణయాలను అమలయ్యాయి.
CM Revanth Reddy 1000 Days Rule : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న 1,000 రోజుల పాలనా మైలురాయిని పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ‘ప్రగతి నివేదిక’ను ఆదివారం విడుదల చేసింది. ప్రజా ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ, సామాజిక న్యాయమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొంది. రైతులు, మహిళలు, యువతలో కొండంత విశ్వాసం నింపడంతో పాటు భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో తెలంగాణ చరిత్రలో రేవంత్ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని వివరించింది.

ఆర్థిక ప్రగతిలో రికార్డులు….
ప్రగతి నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం…. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ప్రభుత్వం చేపట్టిన సాహసోపేత నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరింది. ఇది జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే దాదాపు 91 శాతం ఎక్కువ కావడం విశేషం. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ భారీగా పెట్టుబడులను రాబట్టడం, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడం, ఐటీ మరియు సాంకేతిక రంగాలను విస్తరించడం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేసింది. ఈ సామూహిక వికాసంలో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు భాగస్వాములయ్యారు.
దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా రైతుల కోసం రూ.2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను ఒకే విడతలో ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డాయి.
'రైతు భరోసా' పథకం ద్వారా ఇప్పటివరకు రూ.36,000 కోట్లకు పైగా పెట్టుబడి సాయాన్ని అందించారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్నారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బీమా పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నారు. గడిచిన 32 నెలల కాలంలోనే వ్యవసాయం, దానికి అనుబంధ రంగాల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ ప్రోత్సాహకాలతో తెలంగాణ అన్నపూర్ణగా మారింది. వరి సాగు, ఉత్పత్తిలో వరి రారాజుగా పేరొందిన పంజాబ్ రాష్ట్రాన్ని తెలంగాణ అధిగమించింది. గత యాసంగి (రబీ) సీజన్లో ఏకంగా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు ప్రగతి నివేదికలో సర్కార్ వివరించింది.
మహిళా సాధికారత, సంక్షేమ పథకాలు
- ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
- మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఇప్పటివరకు మహిళలు 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు (ట్రిప్పులు) చేశారు.
- 'గృహ జ్యోతి' పథకం కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు.
- మహాలక్ష్మి పథకంలో భాగంగానే 43 లక్షల పేద కుటుంబాలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి కులాల వారీ సామాజిక స్థితిగతులు వెల్లడించినట్లు ప్రగతి నివేదికలో వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను 3గ్రూపులుగా వర్గీకరించి… ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత వహించింది. గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చినట్లు ప్రకటించారు. ఆహార కల్తీ, డ్రగ్స్ ముప్పును సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ సంస్థ ఏర్పాటుచేయగా… డ్రగ్స్పై ఈగల్ వ్యవస్థ ద్వారా ప్రత్యేక పోరాటం చేస్తున్నట్లు పేర్కన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

