ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యే విధానం తీసుకురావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ నేపథ్యంలో అనేక వార్తలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారుడి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరిస్తున్నారంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయ్యేలా చేసే విధానం ఏదీ ప్రస్తుతం అమలులో లేదని స్పష్టం చేసింది.

ట్రాఫిక్ చలానాల కోసం వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను లేదా యజమానుల బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేసి, డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయ్యేలా చేసే విధానం ఏదీ ప్రస్తుతం అమలులో లేదు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరితి కోరారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో చలానాల కోసం బ్యాంక్ వివరాలు సేకరిస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని రవాణా శాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
రవాణశాఖ అధికారిక ప్రకటన -
ట్రాఫిక్ చలానాల ప్రస్తుత అమలులో ఉన్న విధానంలో మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను రెండు రకాలుగా పరిగణిస్తారు. పరిష్కరించుకోదగిన (కాంపౌండబుల్) నేరాలు, పరిష్కారం చేసుకోలేని (నాన్-కాంపౌండబుల్) నేరాలు. ఒకవేళ తప్పుడు చలానా పడిందని భావిస్తే, పౌరులు దానిని కోర్టులో సవాలు చేసే హక్కు కలిగి ఉంటారు. దీనికి సంబంధించిన నిబంధనలు 'పరివాహన్ ఇ-చలాన్' పోర్టల్లో స్పష్టంగా ఉన్నాయి.
చలానా జారీ చేసిన తర్వాత… ఆ చలానాపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు ఆన్లైన్లో 'గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఆఫీసర్'కు ఫిర్యాదు చేయవచ్చు. మీ అభ్యంతరాన్ని అంగీకరిస్తే, ఆ మేరకు సమాచారం అందుతుంది. ఒకవేళ అభ్యంతరం తిరస్కరిస్తే, చలానా చెల్లించడానికి మరో 45 రోజుల సమయం ఉంటుంది. అంటే… చలానా చెల్లించడానికి తగినంత సమయం ఇస్తారు. ఏ దశలోనూ మీ ఖాతా నుండి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవ్వవు. త్వరలోనే అన్ని రకాల ట్రాఫిక్ ఫిర్యాదులను పరిష్కరించడానికి రవాణా శాఖ ఒక ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఆఫీసర్ను నియమించనుంది.
- 2022లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో రోడ్డు భద్రతా సలహా కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే 2025లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆరు నెలల్లోపు రోడ్డు భద్రతా నిబంధనలను రూపొందించాలని ఆదేశించింది. ఇందులో పాదచారుల రక్షణ మరియు ఇతర వాహనాల క్రమబద్ధీకరణ వంటి అంశాలు ఉన్నాయి.
- ప్రమాదాలను నివారించడం మరియు ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చట్టపరమైన నిబంధనలను ఉద్దేశించి చేసినవి మాత్రమే.
- తెలంగాణలో ఏటా దాదాపు 7,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. వీరిలో 10 శాతం మంది చిన్నపిల్లలే. అదే కాకుండా మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది 25-30 ఏళ్ల మధ్య వయసున్న యువకులే ఉండటం విచారకరం.
- ముఖ్యంగా బైక్ ప్రమాదాల వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద మరణాల్లో తెలంగాణ దేశంలోనే 10 లేదా 11వ స్థానంలో ఉంది. ఈ విషయాలే మనకు రోడ్డు భద్రతలో కఠిన నిబంధనలు ఎందుకు అవసరం అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి" అని రవాణా శాఖ పేర్కొంది.