హైదరాబాద్ మహానగర పరిధిలో పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు, సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వం ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026’ ముసాయిదాను ప్రజల సలహాలు, సూచనల కోసం విడుదల చేసింది.

ఈ కొత్త బిల్లు ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమగ్ర పాలనా వ్యవస్థ(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ సిస్టమ్) కిందికి తీసుకురానున్నారు. కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పరిపాలనను కొనసాగిస్తూనే, మెట్రో స్థాయిలో మెరుగైన సమన్వయం సాధించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
1955 నాటి జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో మార్పులు
గతంలో 15 లక్షల జనాభా ఉన్నప్పటి అవసరాల కోసం ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955’ ను తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం 1.3 కోట్ల జనాభాతో కూడిన భారీ మహానగరంగా ఎదిగింది. మారుతున్న కాలం, పెరిగిన జనాభా అవసరాలకు పాత చట్టం సరిపోవడం లేదని భావించిన ప్రభుత్వం, దాని స్థానంలో ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.
పాత చట్టంలోని కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డు కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తి పన్ను పరిపాలన, అప్పుల వసూలు అధికారాలు, జంతు సంక్షేమం వంటి ప్రధానాంశాలు యథాతథంగా కొనసాగుతాయి. అయితే నగర అభివృద్ధి కోసం కొన్ని కీలక సంస్కరణలను ఈ బిల్లులో చేర్చారు.
బిల్లులోని ముఖ్యమైన సంస్కరణలు
ఆస్తి పన్నును ప్రస్తుత 'యాన్యువల్ రెంటల్ వాల్యూ' పద్ధతి నుండి 'క్యాపిటల్ వాల్యూ' పద్ధతికి మారుస్తారు.
{{/usCountry}}ఆస్తి పన్నును ప్రస్తుత 'యాన్యువల్ రెంటల్ వాల్యూ' పద్ధతి నుండి 'క్యాపిటల్ వాల్యూ' పద్ధతికి మారుస్తారు.
{{/usCountry}}అక్ట్రాయ్ (Octroi)/డాగ్ టాక్స్ (కుక్కల పన్ను)లను రద్దు చేస్తారు. దీనికి బదులుగా సెల్ఫ్ అసెస్మెంట్, ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ , సకాలంలో పన్నులు చెల్లించే వారికి రాయితీలను ప్రవేశపెడతారు.
వ్యాపారాలను సులభతరం చేయడానికి అన్ని రకాల వ్యాపారాలకు ఒకే రకమైన 'సింగిల్ ట్రేడ్ లైసెన్స్' విధానాన్ని తీసుకువస్తారు. అలాగే రాత్రి వేళల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు 'నైట్-ఎకానమీ ఫ్రేమ్వర్క్'ను ప్రవేశపెడతారు.
జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత వీధుల అభివృద్ధి ప్రణాళికలు, అందరికీ ఉపయోగపడేలా యూనివర్సల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, భూగర్భ వసతులు, భవన నిర్మాణాలకు 'డీమ్డ్ అప్రూవల్' వంటి సంస్కరణలు ఉంటాయి. కొన్ని సివిల్ జరిమానాలను నేరపూరితం కానివిగా మారుస్తారు.
ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇస్తారు. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలు HMWSSB (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్) పరిధిలోనే ఉంటాయి.
పబ్లిక్ న్యూసెన్స్ సమస్యల పరిష్కారాన్ని సరళీకరిస్తారు. పారిశుధ్య కార్మికుల గౌరవం, ఆరోగ్యం, భద్రతను రక్షించడానికి పారిశుధ్య విభాగాన్ని మ్యాన్యువల్ స్కావెంజర్స్ చట్టం పరిధితో అనుసంధానిస్తారు.
నూతన అథారిటీలు - పర్యవేక్షణ వ్యవస్థలు
CURE అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్: ఈ కొత్త వ్యవస్థ కోసం ఒక అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు.
హైడ్రా (HYDRAA) బాధ్యతలు: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యతలను పూర్తిగా 'హైడ్రా' చూసుకుంటుంది.
ప్రత్యేక విభాగాలు
విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్లైమేట్ యాక్షన్ (వాతావరణ మార్పులు), వారసత్వ కట్టడాల సంరక్షణ, ఆహార భద్రత, జెండర్ ఇన్క్లూజన్ (లింగ సమానత్వం), కార్మిక సంక్షేమం కోసం విడివిడిగా ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేస్తారు.
వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య రియల్ టైమ్ పర్యవేక్షణ, అత్యవసర సమన్వయం కోసం ‘CURE SMART Governance Centre’ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ‘CURE Appellate Authority’ ని ఏర్పాటు చేస్తారు. నగరవాసుల కోసం ఒకే సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ డిజిటల్ పోర్టల్, అన్ని సేవలకూ కలిపి ఒకే ఒక కన్సాలిడేటెడ్ యుటిలిటీ బిల్ (Single Consolidated Utility Bill) విధానాన్ని ప్రతిపాదించారు.
సలహాలు చెప్పండి
ఈ ప్రతిపాదిత బిల్లుపై నగర ప్రజలు, నిపుణులు, వాటాదారులు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక పత్రాన్ని జీహెచ్ఎంసీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.