...
...
Next Story

జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ రీజియన్.. బిల్లులోని ముఖ్యమైన విషయాలు

తెలంగాణ ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026ను ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది. ఇందులో అనేక విషయాలను ప్రస్తావించింది. జీహెచ్ఎంసీ చట్టానికి బదులుగా దీనిని తీసుకువస్తారు.

Published on: Jul 5, 2026, 21:14:45 IST
Advertisement

హైదరాబాద్ మహానగర పరిధిలో పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు, సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వం ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026’ ముసాయిదాను ప్రజల సలహాలు, సూచనల కోసం విడుదల చేసింది.

కోర్ అర్బన్ రీజియన్ బిల్లు
కోర్ అర్బన్ రీజియన్ బిల్లు

ఈ కొత్త బిల్లు ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమగ్ర పాలనా వ్యవస్థ(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ సిస్టమ్) కిందికి తీసుకురానున్నారు. కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పరిపాలనను కొనసాగిస్తూనే, మెట్రో స్థాయిలో మెరుగైన సమన్వయం సాధించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

1955 నాటి జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో మార్పులు

గతంలో 15 లక్షల జనాభా ఉన్నప్పటి అవసరాల కోసం ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955’ ను తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం 1.3 కోట్ల జనాభాతో కూడిన భారీ మహానగరంగా ఎదిగింది. మారుతున్న కాలం, పెరిగిన జనాభా అవసరాలకు పాత చట్టం సరిపోవడం లేదని భావించిన ప్రభుత్వం, దాని స్థానంలో ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.

పాత చట్టంలోని కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డు కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తి పన్ను పరిపాలన, అప్పుల వసూలు అధికారాలు, జంతు సంక్షేమం వంటి ప్రధానాంశాలు యథాతథంగా కొనసాగుతాయి. అయితే నగర అభివృద్ధి కోసం కొన్ని కీలక సంస్కరణలను ఈ బిల్లులో చేర్చారు.

బిల్లులోని ముఖ్యమైన సంస్కరణలు

అక్ట్రాయ్ (Octroi)/డాగ్ టాక్స్ (కుక్కల పన్ను)లను రద్దు చేస్తారు. దీనికి బదులుగా సెల్ఫ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ , సకాలంలో పన్నులు చెల్లించే వారికి రాయితీలను ప్రవేశపెడతారు.

వ్యాపారాలను సులభతరం చేయడానికి అన్ని రకాల వ్యాపారాలకు ఒకే రకమైన 'సింగిల్ ట్రేడ్ లైసెన్స్' విధానాన్ని తీసుకువస్తారు. అలాగే రాత్రి వేళల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు 'నైట్-ఎకానమీ ఫ్రేమ్‌వర్క్'ను ప్రవేశపెడతారు.

జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత వీధుల అభివృద్ధి ప్రణాళికలు, అందరికీ ఉపయోగపడేలా యూనివర్సల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, భూగర్భ వసతులు, భవన నిర్మాణాలకు 'డీమ్డ్ అప్రూవల్' వంటి సంస్కరణలు ఉంటాయి. కొన్ని సివిల్ జరిమానాలను నేరపూరితం కానివిగా మారుస్తారు.

ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇస్తారు. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలు HMWSSB (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్) పరిధిలోనే ఉంటాయి.

పబ్లిక్ న్యూసెన్స్ సమస్యల పరిష్కారాన్ని సరళీకరిస్తారు. పారిశుధ్య కార్మికుల గౌరవం, ఆరోగ్యం, భద్రతను రక్షించడానికి పారిశుధ్య విభాగాన్ని మ్యాన్యువల్ స్కావెంజర్స్ చట్టం పరిధితో అనుసంధానిస్తారు.

నూతన అథారిటీలు - పర్యవేక్షణ వ్యవస్థలు

CURE అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్: ఈ కొత్త వ్యవస్థ కోసం ఒక అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు.

హైడ్రా (HYDRAA) బాధ్యతలు: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యతలను పూర్తిగా 'హైడ్రా' చూసుకుంటుంది.

ప్రత్యేక విభాగాలు

విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, క్లైమేట్ యాక్షన్ (వాతావరణ మార్పులు), వారసత్వ కట్టడాల సంరక్షణ, ఆహార భద్రత, జెండర్ ఇన్‌క్లూజన్ (లింగ సమానత్వం), కార్మిక సంక్షేమం కోసం విడివిడిగా ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేస్తారు.

వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య రియల్ టైమ్ పర్యవేక్షణ, అత్యవసర సమన్వయం కోసం ‘CURE SMART Governance Centre’ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ‘CURE Appellate Authority’ ని ఏర్పాటు చేస్తారు. నగరవాసుల కోసం ఒకే సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ డిజిటల్ పోర్టల్, అన్ని సేవలకూ కలిపి ఒకే ఒక కన్సాలిడేటెడ్ యుటిలిటీ బిల్ (Single Consolidated Utility Bill) విధానాన్ని ప్రతిపాదించారు.

సలహాలు చెప్పండి

ఈ ప్రతిపాదిత బిల్లుపై నగర ప్రజలు, నిపుణులు, వాటాదారులు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక పత్రాన్ని జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe