నేటి నుంచి మెుదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు.. అర్హతలు, ఏమేం కావాలి?

తెలంగాణలో స్థానిక ఎన్నికల పండుగ మెుదలైంది. నేటి నుంచే మెుదటి విడత ఎన్నికలకు నామినేషన్లు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమేం కావాలో చూద్దాం..

Published on: Nov 27, 2025, 05:40:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మెుదలైంది. మూడు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఆయా రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు

ఎన్నికల సంఘం ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. పలు కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికలను జరగడం లేదు.

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లు. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు తుది ఫలితాలను ప్రకటిస్తారు. మెుదటి దశలో 4,200 సర్పంచ్‌ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి.

ఏమేం కావాలి?

గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి తప్పనిసరిగా గ్రామ పంచాయతీ స్థానికుడై ఉండాలి. ఇందుకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం. పోటీ చేయాలనుకునే అభ్యర్థి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే సమయానికి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. రిజర్వ్ చేసిన స్థానాల్లో సంబంధిత రిజర్వ్‌డ్ అభ్యర్థులకే అవకాశం ఉంది. ఇందుకోసం క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయవచ్చు. మహిళలు వారికి రిజర్వ్ చేసిన స్థానాలతోపాటుగా జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయవచ్చు. ఇద్దరు పిల్లలు నిబంధన కూడా ఎత్తివేశారు.

నేర చరిత్ర, చర, స్తిర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్‌పై ఇద్దరు సాక్షులతో సంతకం చేయించాలి. ఎలక్షన్ ఖర్చు వివరాలకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి. నామినేషన్ పత్రంలో సంతకాల విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. హౌస్ టాక్స్ కట్టి ఉండాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More