ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. అధికారుల ముందు హాజరు కావాలని తెలిపింది
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని సమన్లు జారీ చేసింది. జనవరి 8, గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు హాజరు కావాలని తెలిపింది.

బీఆర్ఎస్ పాలనలో ఫోన్లు ట్యాప్ చేసిన వ్యక్తులలో కొండల్ రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. అప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఆయనను పిలిచి సిట్ విచారణ చేయనుంది. కొండల్రెడ్డితోపాటుగా మరికొందరికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు నాయకులకు కూడా సిట్ విచారణకు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య గురువారం హాజరు కావాలని ఆదేశించారు అధికారులు. ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను సిట్ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.
బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. నవీన్ రావు తండ్రి కొండల్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు సిట్ సమన్లు జారీ చేసింది. అయితే వారు సిట్ ముందు హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా తాను సిట్ ముందు హాజరు కాలేకపోతున్నానని కొండల్ రావు సిట్కు తెలియజేశారు. తన నివాసంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటానని ఆయన ముందుకొచ్చారు.
కొండల్ రావు, సందీప్ రావు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని అధికారులు గుర్తించారు. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లోని అసమ్మతివాదుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్సీ నవీన్ రావు జనవరి 4న సిట్ ముందు హాజరయ్యారు. అధికారులు ఆయనను దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు.
గత నెలలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి.ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. 14 రోజులపాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జిషీట్లో పొందుపరుస్తారు. ఆయన కస్టడీ విచారణపై సిట్ జనవరి 16న సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు మార్చి 2024లో వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రణీత్ రావు మొదట అరెస్టు అయ్యారు. తదుపరి దర్యాప్తులో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు సహా వివిధ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున నిఘా ఆపరేషన్ జరిగినట్లు వెల్లడైంది.
ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను చేర్చారు, వీరిలో శ్రావణ్ కుమార్తో పాటు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, ఎన్.భుజంగ రావు, మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ఉన్నారు.














