ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు!

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published on: Dec 14, 2025 2:25 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోరు ముగిసింది. రెండో దశలో 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీలకు, 29911 వార్డు మెంబర్ల కోసం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటలకు ఓట్లు లెక్కింపు మెుదలుపెట్టారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా సుమారు 57 లక్షల 22 వేలకుపైగా ఓటర్లు పాల్గొన్నారు.

రెండో విడత పంచాయతీ ఎన్నికలు
రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఆదివారం కావడంతో ఊర్లలో కూడా సందడి నెలకొంది. పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఓటు వేసేందుకు తరలివచ్చారు. 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ల అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 57 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ జరిగింది.

ఎన్నికల ప్రశాంతంగా జరిగినప్పటికీ కొన్ని ప్రదేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెదక్ జిల్లాలోని కొనాయిపల్లి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య మెుదలైన వాగ్వాదం.. తోపులాటకు దారితీసింది.

మెుదక్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. నర్సంపల్లి పెద్దతండా పంచాయతీ సర్పంచ్ పదవికి శంకర్ నాయక్ భార్య పోటీ చేశారు. అయితే ప్రత్యర్థులు ఓటుకు రూ.2వేలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. సర్పంచ్ పదవికి పోటీ చేసి గతంలో ఓడిపోయానని, డబ్బులు పంచి ప్రత్యర్థులు ఎన్నికల్లో నెగ్గుతున్నారని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అవంచలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. పరస్పర దాడులు కూడా జరిగాయి.

మెుదటి దశలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారు 2425 స్థానాల్లో గెలిచారు. ఇందులో ఏకగ్రీవాలు కూడా ఉన్నాయి. మెుత్తం 4230 స్థానాలకుగానూ ఆ పార్టీ 57.32 శాతం గ్రామ పంచాయతీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచన అభ్యర్థులు 1168 స్థానాల్లో గెలిచారు. అంటే ఇది 27.6 శాతం. బీజేపీ 189(4.5శాతం) స్థానాల్లో విజయం సాధించింది. సీపీఎం 24, సీపీఐ 23 స్థానాలను గెలవగా.. స్వతంత్రులు 401 స్థానాలు గెలిచారు. అయితే ఏకగ్రీవాలతో కలిపి తమ పార్టీ 60.69 శాతం స్థానాలను సాధించిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.