Telangana Special TET 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. సర్వీసులో ఉన్న టీచర్ల కోసం సెప్టెంబరు 8, 9 తేదీల్లో ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి కాలపట్టికను (షెడ్యూల్) పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఖరారు చేసింది.

ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ల అర్హతలు, మాధ్యమాల ఆధారంగా పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
పరీక్షల నిర్వహణ షెడ్యూల్ వివరాలు:
- సెప్టెంబరు 8 (మొదటి రోజు): ఉదయం సెషన్లో పేపర్-1 పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు చెందిన ఉపాధ్యాయులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
- సెప్టెంబరు 9 (రెండో రోజు) : మధ్యాహ్నం సెషన్లో ఇతర మాధ్యమాల (ఉర్దూ, మరాఠీ, కన్నడ తదితర) వారికి పేపర్-2 పరీక్షను పూర్తి చేస్తారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్షను ఏర్పాటు చేసింది. పరీక్షకు హాజరవుతున్న ఉపాధ్యాయులు హాల్టికెట్లు, ఇతర తాజా సమాచారం కోసం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని అధికారులు సూచించారు.