తెలంగాణ సర్కార్‌కు మద్యం కంపెనీల అల్టిమేటం: రూ. 3,900 కోట్ల బకాయిలు చెల్లించండి

తెలంగాణ ప్రభుత్వం మద్యం కంపెనీలకు చెల్లించాల్సిన రూ. 3,900 కోట్ల బకాయిలు రాష్ట్ర పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. దావోస్ సదస్సు వేళ ఈ జాప్యం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Published on: Jan 16, 2026, 16:05:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్టను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 దావోస్ సదస్సు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, మద్యం తయారీ పరిశ్రమల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. సుమారు రూ. 3,900 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే, రాష్ట్రానికి వచ్చే కొత్త పెట్టుబడులు ఆగిపోవడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

తెలంగాణ సర్కార్‌కు మద్యం కంపెనీల అల్టిమేటం: రూ. 3,900 కోట్ల బకాయిలు చెల్లించండి (REUTERS)
తెలంగాణ సర్కార్‌కు మద్యం కంపెనీల అల్టిమేటం: రూ. 3,900 కోట్ల బకాయిలు చెల్లించండి (REUTERS)

ఏడాదికి పైగా పెండింగ్‌లో రూ. 900 కోట్లు

బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీస్ (CIABC) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) తమకు రూ. 3,900 కోట్లు చెల్లించాల్సి ఉందని, అందులో రూ. 900 కోట్లు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించాయి. డియాజియో, పెర్నోడ్ రికార్డ్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఈ బకాయిల అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

"రాష్ట్ర ఖజానాకు మద్యం రంగం భారీగా ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా, నెలల తరబడి జాప్యం చేయడం వల్ల సరఫరా గొలుసు దెబ్బతింటుంది. ఇది ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతుంది" అని ఈ మూడు సంఘాలు పేర్కొన్నాయి.

పెట్టుబడులపై నీలి నీడలు

తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులు గత ఏడాదితో పోలిస్తే సగానికి పైగా పడిపోయాయి. 2023-24లో రూ. 28,100 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, 2024-25 నాటికి రూ. 13,730 కోట్లకు పడిపోవడం గమనార్హం. బకాయిల చెల్లింపులో జాప్యం కూడా ఇందుకు ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, తెలంగాణ ఎక్సైజ్ ఆదాయం గత పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 2013-14లో రూ. 9,000 కోట్లుగా ఉన్న ఆదాయం, 2023-24 నాటికి రూ. 38,000 కోట్లకు చేరుకుంది. కేవలం అక్టోబర్ 2025లోనే లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వం రూ. 3,000 కోట్లు వసూలు చేసింది. ఇంత భారీ ఆదాయం వస్తున్నా, సరఫరాదారులకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి.

నిలిచిపోయిన సరఫరా.. పెరుగుతున్న ఆందోళన

"ముఖ్యమంత్రిని 2024 జూలైలో కలిసినప్పుడు మూడు నెలల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ 2025 జనవరి నాటికి మళ్లీ చెల్లింపులు ఆగిపోయాయి. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక మద్యం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీర్ మార్కెట్‌లో 70 శాతం వాటా కలిగిన యునైటెడ్ బ్రూవరీస్ (UB) ఇప్పటికే TGBCLకు సరఫరా నిలిపివేసింది. పెరిగిన ముడిసరుకు ఖర్చులకు అనుగుణంగా ధరలు సవరించకపోవడం, పాత బకాయిలు పేరుకుపోవడంతో కార్యకలాపాలు నిర్వహించడం భారంగా మారిందని సంస్థ తెలిపింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో పన్నుల పెంపు వల్ల సేల్స్ తగ్గిన నేపథ్యంలో, మద్యం కంపెనీలకు తెలంగాణ కీలక మార్కెట్. కానీ ఇక్కడి చెల్లింపుల జాప్యం వారిని అయోమయంలో పడేస్తోంది.

వెంటనే లైసెన్స్ వేలం ద్వారా వచ్చిన నిధులతో బకాయిలు చెల్లించి, ఇన్వెస్టర్లలో భరోసా నింపాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More