తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. చలి తీవ్రత తగ్గుతూ… ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నెల దాటిన తర్వాత ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉక్కపోత కూడా ప్రారంభమైంది. అయితే ఈ ఏడాదిలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే సూచనలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
అల్పపీడం ఎఫెక్ట్…
మరోవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సోమవారం అల్పపీడం ఏర్పడింది. ఇది ఈనెల 18వ తేదీ నాటికి నైరుతి బంగాళాతం వైపు కదులుతూ హిందూ మహాసముద్ర మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజాగా ఏర్పడిన అల్పడీనంతో…. ఈనెల 18వ తేదీన రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు పడొచ్చని అంచనా. ఇక ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉత్తర తెలంగాణతో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం….ఫిబ్రవరి 22వ తేదీన ఆదిలాబాద్ నుంచి ములుగు వరకు కొన్నిచోట్ల వర్షాలు పడొచ్చు. ఫిబ్రవరి 23 - 24 తేదీల మధ్య హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ నాటికి ఈ వర్షాలపై మరింత క్లారిటీ రావొచ్చు అని అంచనా.
ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అయితే ఎలాంటి వర్ష సూచన లేదని అంచనా వేసింది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి.