TG SET 2025 : తెలంగాణ 'సెట్' అభ్యర్థులకు అలర్ట్ - పరీక్ష తేదీలు ఖరారు, ఇవిగో వివరాలు
టీజీ సెట్ - 2025పై కీలక అప్డేట్ వచ్చేసింది. పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేస్తారు. డిసెంబర్ 10,11,12 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు.
తెలంగాణ సెట్(TS SET-2025) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. పరీక్ష తేదీలను ఖరారు చేసూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

పరీక్ష తేదీలివే…
టీజీ సెట్ - 2025 పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 12వ తేదీతో అన్ని సబ్జెక్టుల పేపర్లు పూర్తవుతాయని. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీబీటీ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. http://telanganaset.org/ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే…?
టీజీ సెట్ - 2025 పరీక్ష కోసం నవంబర్ 14వ తేదీ వరకు రూ.1,500 ఫైన్ తో అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్ 19 వరకు రూ.2వేల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఇక రూ.3వేల అపరాధ రుసుముతో నవంబర్ 21 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. సాధారణ ఫీజు కింద అయితే… ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్జెండర్లకు రూ.1000గా దరఖాస్తు రుసుం నిర్ణయించారు. ఇక నవంబర్ 26 నుంచి 28 తేదీల్లో అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
ఈ ఏడాది కూడా టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీనే నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. సెట్ పరీక్ష రాసేందుకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్షా విధానం ఇలా …
టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు.
ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. http://telanganaset.org/ వెబ్ సైట్లో పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు.













