...
...
Next Story

TGSRTC Night Bus : హైదరాబాద్‌లో ఆర్టీసీ నైట్ బస్సు సర్వీసులు.. ఈ రూట్‌లలో..

Hyderabad Night Bus Services : హైదరాబాద్‌లో రాత్రి సమయాల్లో వెళ్లాలి అంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన టీజీఎస్ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.

Published on: Aug 25, 2026, 16:33:52 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఆగస్టు 29 నుంచి హైదరాబాద్‌లోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఐటీ ఉద్యోగులు, ఆలస్యంగా ఇళ్లకు తిరిగి వచ్చే ఇతరుల నిమిత్తం ఈ బస్సులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నడుస్తాయి. అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రయాణికుల డిమాండ్‌ను అంచనా వేసిన తర్వాత ఈ మార్గాలను ఎంపిక చేశారు. డిమాండ్‌ను బట్టి బస్సులు 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో నడుస్తాయి.

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

రాత్రిపూట ఐటీ ఉద్యోగులు, హోటల్, హాస్పిటాలిటీ రంగ కార్మికులు, దుకాణదారులు, సందర్శకులు, పర్యాటకులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో రాత్రిపూట కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొదటి దశ కోసం ఆరు కారిడార్లను ఖరారు చేశారు. దీనికోసం వివిధ మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు, డిమాండ్‌ను కార్పొరేషన్ అధ్యయనం చేసిందని టీజీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మార్గంలో సుమారు ఎనిమిది బస్సులను నడుపుతారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి బస్సుల ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేస్తారు. తదుపరి విస్తరణపై నిర్ణయం తీసుకునే ముందు కార్పొరేషన్ వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది.

సికింద్రాబాద్‌ను హైటెక్ సిటీ-కొండాపూర్‌తో కలిపే రూట్ 10Hకు భారీగా డిమాండ్ ఉంది. అందుకే ఈ రూట్‌ను ఎంపిక చేశారు. ఈ మార్గంలో అధిక సంఖ్యలో ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు ఉండటం వలన రోజంతా ప్రయాణికుల రద్దీ ఉంటుంది. పగటిపూట ప్రతి 15 నుండి 30 నిమిషాలకు సాధారణ బస్సులు నడుస్తుండగా, రాత్రి సర్వీసులు సుమారుగా ప్రతి 30 నిమిషాల నుండి ఒక గంటకు నడుస్తాయి. ఈ మార్గంలో సుమారు ఎనిమిది నుండి 10 సర్వీసులను నడపడానికి ప్రణాళిక చేశారు.

రాత్రి బస్సుల కోసం కోటి-పటాన్‌చెరు మార్గాన్ని కూడా ఎంపిక చేశారు. ఈ మార్గం హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. పగటిపూట ప్రతి ఐదు నుండి పది నిమిషాలకు క్రమం తప్పకుండా సర్వీసులు నడుస్తాయి. బస్సులు తరచుగా నడుస్తున్నప్పటికీ, ప్రయాణికుల రద్దీ కారణంగా తరచుగా ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి వేళల్లో ఈ మార్గంలో బస్సులు సుమారు గంటకు ఒకసారి నడుస్తాయి. హైటెక్ సిటీ మీదుగా కోటి-పటాన్‌చెరులను కలిపే రూట్ 222A కూడా రాత్రిపూట అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి ప్రతి 30 నిమిషాల నుండి గంట వ్యవధిలో బస్సులు నడుస్తాయి.

సికింద్రాబాద్-పటాన్‌చెరులను కలిపే రూట్ 219 రాత్రిపూట నడిపే ఆరు మార్గాల నెట్‌వర్క్‌లో భాగంగా ఉంది. బాచుపల్లి, పరిసర ప్రాంతాలను కలిపే రూట్ 195W, ఐటీ ఉద్యోగులతో పాటు రాత్రి వేళల్లో పనిచేసే సంస్థలలోని ఉద్యోగులకు కూడా సేవలందిస్తుంది. సాధారణ బస్సు సర్వీసులు తగ్గిన తర్వాత ప్రజా రవాణా సదుపాయాలు పరిమితంగా ఉండే హౌస్‌కీపింగ్, హోటళ్లు, ఇతర వ్యాపార రంగాల ఉద్యోగులకు కూడా ఈ సేవలు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks