Indiramma Housing Scheme : 16 నియోజకవర్గాలు.. 8 వేల ఫ్లాట్లు - ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రా ప్రారంభం

Telangana Indiramma Housing Scheme : హైదరాబాద్‌లో  ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు పారదర్శకంగా లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభమైంది. 16 నియోజకవర్గాల్లో 8 వేల ఫ్లాట్లకు ఉచిత రిజిస్ట్రేషన్ అందించనున్నారు.

Published on: Aug 28, 2026, 16:00:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Indiramma Housing Scheme :హైదరాబాద్ మహానగరంలో 'ఇందిరమ్మ టవర్స్' ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టింది. అర్హతే ఏకైక ప్రామాణికంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రా
ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రా

క్యూర్‌ (CURE) పరిధిలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి అర్హులైన ప్రజలు, మీడియా సమక్షంలోనే లక్కీడ్రా నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను లైవ్ ప్రసారాల ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు. నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఫ్లాట్ల కోసం నాంపల్లిలోని వెట్ గార్డెన్స్, లక్ష్మీగూడ కేంద్రాల్లో మంత్రి పొంగులేటి స్వయంగా పాల్గొని లక్కీడ్రా తీశారు.

16 నియోజకవర్గాలు.. 8 వేల ఫ్లాట్లు

ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8,000 ఫ్లాట్లకు రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్ల కేటాయింపు కోసం ప్రాథమికంగా 600 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపడతారు. పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే, వెయిటింగ్ లిస్టులో ఉన్న మిగిలిన 120 మందికి అవకాశం కల్పిస్తూ నిజమైన పేదలకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకుంటారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. శంకుస్థాపన జరిగిన అత్యంత స్వల్ప వ్యవధిలోనే 16 నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, లక్కీడ్రా స్థాయికి తీసుకురావడం ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. తొలి విడతగా క్యూర్‌ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల సేకరణ పూర్తయింది. ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఉచిత రిజిస్ట్రేషన్….

ప్రభుత్వానికి వేల కోట్ల రాబడి కంటే పేదవాడికి నగరంలో ఆత్మగౌరవంతో కూడిన నీడను అందించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఎకరం రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రైమ్ ప్రాంతాల్లో సైతం నిరుపేదలు నివసించేలా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు.

  • రిజిస్ట్రేషన్ పూర్తయిన 10 సంవత్సరాల తర్వాత అవసరాన్ని బట్టి ఈ ఫ్లాట్‌ను విక్రయించుకునే హక్కు ఉంటుంది. అత్యవసర ఆర్థిక అవసరాలు ఏర్పడితే రిజిస్ట్రేషన్ పత్రాలను బ్యాంకులలో కుదువ పెట్టి రుణం పొందే వెసులుబాటు కూడా కల్పించారు.
  • ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ అందిస్తారు. ఒక్కో ఇంటికి 17 నుండి 20 గజాల అన్‌డివైడెడ్ షేర్ (UDS) లభిస్తుంది. 10 అంతస్తుల వరకు నిర్మించే ఈ టవర్లలో లిఫ్టులు, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయి. లక్కీడ్రా ముగిసిన 3-4 రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. లబ్ధిదారులు స్వయంగా పనులను పర్యవేక్షించుకోవచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, అందులో ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరాయని మంత్రి తెలిపారు. రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. త్వరలోనే రెండో విడత కింద మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి పది రోజుల్లో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తామని తెలిపారు.

నాంపల్లి నియోజకవర్గంలో జరిగిన లక్కీ డ్రాలో ఎస్సీ కేటగిరీ కింద 67 ఫ్లాట్ల కోసం 288 మంది దరఖాస్తుదారులలో తొలి ఫ్లాట్‌ను మరకాల కృష్ణవేణి దక్కించుకోగా, అనంతరం టి.అనిత, మంగనూరి అనసూయ, ఎం.కుమారి, శైలజాకుమారిలు ఫ్లాట్లను పొంది ఆనందం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More