1వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనుంది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్‌లు అందుకోవచ్చు. ఎవరు అర్హులు? ఎక్కడ అప్లై చేయాలి?లాంటి విషయాలను తెలుసుకోండి.

Updated on: Jun 15, 2026, 22:03:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కార్మిక సంక్షేమ సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ ఉపకారవేతన పథకాల కింద ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీ కార్మికులు, సున్నపురాయి, డోలమైట్, ఇనుప ఖనిజం, మాంగనీస్ - క్రోమ్ ఖనిజాల, అభ్రకం గనులు కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఈ స్కాలర్‌షిప్‌లు ఇస్తారు.

1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు (ప్రీ-మెట్రిక్), 11వ తరగతి నుంచి వృత్తి నిపుణుల డిగ్రీ కోర్సుల వరకు (పోస్ట్-మెట్రిక్) చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పీ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీలు

ప్రీ-మెట్రిక్ (1 నుంచి 10వ తరగతి వరకు): 2026 ఆగస్టు 31

పోస్ట్-మెట్రిక్ (11వ తరగతి నుంచి వృత్తి నిపుణుల డిగ్రీ వరకు): 2026 అక్టోబర్ 31

అభ్యర్థులు దరఖాస్తులను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్‌ఎస్‌పీ) ద్వారా సమర్పించాలి. దరఖాస్తు సమర్పణ, వెరిఫికేషన్‌ విషయంలో సహాయం కోసం అభ్యర్థులు ఎన్ఎస్‌పీ హెల్ప్‌డెస్క్ నంబర్: 0120-6619540 లేదా helpdesk@nsp.gov.in ఈమెయిల్ ద్వారా సంప్రదించొచ్చు.

మరింత సమాచారం కోసం అభ్యర్థులు ‘వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం, కార్మిక సంక్షేమ సంస్థ, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్ – 500001 (ఫోన్: 040-29561297, ఈమెయిల్: wclwohyd@nic.in)’ను లేదా తమకు సమీపంలో ఉన్న ఈ సంస్థ వైద్యశాలలను సంప్రదించొచ్చు.

అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువు కంటే ముందే దరఖాస్తులను సమర్పించాలని వెల్ఫేర్ కమిషనర్ కోరారు.

స్కాలర్‌షిప్‌లు

ఈ పథకం కింద ఒకటో తరగతి నుండి ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది. చదువుతున్న తరగతి లేదా కోర్సును బట్టి, స్కాలర్‌షిప్ మొత్తం సంవత్సరానికి రూ.1,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది. ఒకటి నుండి నాలుగో తరగతి విద్యార్థులకు రూ.1,000, ఐదు నుండి ఎనిమిదో తరగతి వారికి రూ.1,500, తొమ్మిది నుండి పదో తరగతి వారికి రూ.2,000, పదకొండో నుండి పన్నెండో తరగతి వారికి రూ.3,000, ఐటీఐ/పాలిటెక్నిక్/డిగ్రీ కోర్సులకు (బీ.ఎస్.సి. అగ్రికల్చర్‌తో సహా) రూ.6,000, బీఈ, ఎంబీబీఎస్, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులకు రూ.25,000 లభిస్తాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More