ఇక ప్రైవేట్ ఆలయాలపై కూడా స్పెషల్ ఫోకస్…! ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
ప్రైవేట్ ఆలయాలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రైవేటు ఆలయాలు, అందులో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలు, అందులో భక్తుల రద్దీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో.. ఇకపై పండగల సీజన్ల వేళ ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమైంది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలు, అందులో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో ఆ సంస్థ కార్యకలాపాలు, పీపుల్స్ పర్సెప్షన్పై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రోబోయే రోజుల్లో వరుసగా పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయి, కాబట్టి అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
బందోబస్తు ఏర్పాటు చేయండి…
జిల్లాలో అధికారులు తమ తమ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆలయాల పర్యవేక్షణపైన కూడా దృష్టి సారించాలన్నారు. ప్రైవేటు ఆలయాల నిర్వాహకుల నుంచి పండుగలు, పర్వదినాల సమయంలో ఆయా ఆలయాలకు ఎంత మంది భక్తులు రావచ్చని అభిప్రాయపడ్డారు. రద్దీ నియంత్రణకు ఆలయ నిర్వాహకులు చేపడుతున్న చర్యల గురించి ముందుగా అధికారులకు తెలియజేయాలని ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భక్తుల రద్దీ నియంత్రణకు ముందుస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని, అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. తద్వారా ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం లేకుండా నిరోధించాలని అధికారులకు సూచించారు.
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం తదితర పర్వదినాలు, పండుగల వేళల్లో ఆలయాలకు వచ్చే భక్తలు రద్దీ నియంత్రణకు, ఆలయ నిర్వాహకులు, ధర్మకర్తలు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఒక నిబంధనావళిని రూపొందించి అన్ని ప్రైవేటు ఆలయాలకు జారీ చేయాలన్నారు. ప్రైవేటు ఆలయాలు తమ పరిధి కాదనే నిర్లక్ష్యం అధికారుల్లో ఉండకూడదన్నారు.
ప్రైవేటు ఆలయాల నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఆలయ నిర్వాహకులు, ఆలయ ధర్మకర్తలదే అయినప్పటికీ, రద్దీ సమయాల్లో ఆయా ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఆలయాల్లో పరిశుభ్రతకు పెద్ద పీఠ వేయాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీ సమయాల్లో ఆలయాల్లో పారిశుధ్య లోపం రాకుండా, తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎరువుల కొరత ఉండొద్దు - సీఎస్
రబీ సీజన్కు ఎరువుల కొరత ఉండకుండా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని విజయానంద్ వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. దీనిపై వ్యవసాయశాఖాధికారులు స్పందిస్తూ ఇప్పటికే ఎక్కడా కూడా ఎరువులు కొరత లేకుండా చేశామని, రైతులకు ఎరువులు సమృద్ధిగా లభిస్తున్నాయని తెలిపారు. వచ్చే రబీ సీజనలో రైతులకు సమృద్ధిగా ఎరువులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రబీ సీజన్లో ఎరువుల కొరత అనే సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.













