AP Telangana Weather : ఓవైపు ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు - తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
గడిచిన కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొడుతుండగా… సాయంత్రం అయ్యే సమయానికి వాతావరణం చల్లబడటం, వర్షం పడటం వంటివి జరుగుతున్నాయి.

ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర - పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ అంచనా వేసింది. వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. ఇవాళ, రేపు శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి, పోలవరం,అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు ఇవాళ పోలవరం జిల్లాలోని చింతూరు,ఎన్టీఆర్ జిల్లా జిల్లాలోని కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం 66 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలోనూ భిన్న వాతావరణం..!
ఇక తెలంగాణలో భిన్న వాతావరణం ఉంది. ఓవైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా… మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు పడతున్నాయి. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కొన్ని గంటల పాటు కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. మరికొన్నిచోట్ల కూడా బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇక మరికొన్నిరోజులు కూడా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు(ఏప్రిల్ 7) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ) తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ తర్వాత పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

