CM CBN District Tours : జూలై 1 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం చంద్రబాబు - 5 రోజుల షెడ్యూల్ ఇలా
CM CBN District Tours : ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 1 నుంచి ఐదు రోజుల పాటు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
CM Chandrababu District Tours :రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. జులై 1వ తేదీ నుండి జులై 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా పరిధిలోని నాలుగు కీలక జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అంతేకాకుండా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారిక పర్యటన షెడ్యూల్ వివరాలను ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
జులై 1: నెల్లూరు, తిరుపతి (శ్రీసిటీ) పర్యటన
పర్యటనలో మొదటి రోజైన జులై 1న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో అడుగుపెడతారు. జిల్లాలోని చిల్లాకూరు మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 'పేదల సేవలో' పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుండి తిరుపతి జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక హబ్ 'శ్రీసిటీ'కి చేరుకుంటారు. శ్రీసిటీలో సుమారు రూ. 750 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 'హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్' (Hero MotoCorp Global Parts Centre) నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. ఆ రాత్రికి ఆయన శ్రీసిటీలోనే బస చేస్తారు.
జులై 2: ఉపాధి మిషన్ ప్రారంభం, జీఎస్డీపీ వర్క్షాప్
రెండో రోజు జులై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అక్కడ 'వికసిత్ భారత్' గ్యారెంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ (VB G RAM G) కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం తిరుపతి నగరంలో నిర్వహించే 'స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి సామర్థ్య పెంపు' వర్క్షాప్కు ఆయన హాజరవుతారు. ఈ సదస్సుకు నీతి ఆయోగ్ (NITI Aayog) సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి తిరుపతిలోనే రాత్రికి బస చేస్తారు.
జులై 3: రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం
మూడో రోజు జులై 3న ముఖ్యమంత్రి కడప జిల్లాలో పర్యటిస్తారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సున్నాపురాళ్లపల్లె గ్రామం వద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులను చంద్రబాబు అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుంది.
జులై 3 నుంచి 5 : కుప్పం నియోజకవర్గ పర్యటన
పర్యటన చివరి దశలో భాగంగా జులై 3వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం చేరుకుంటారు. జులై 5వ తేదీ వరకు అంటే దాదాపు మూడు రోజుల పాటు ఆయన కుప్పంలోనే ఉంటారు. స్థానికంగా పెండింగ్లో ఉన్న పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించి స్థానిక సమస్యలను సమీక్షిస్తారు. జులై 5న కుప్పం పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి తిరిగి రాజధాని అమరావతికి చేరుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

