AP EAPCET 2026 Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు ఎప్పుడు..? తాజా అప్డేట్ ఇదే
AP EAPCET 2026 Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల మరింత ఆలస్యం కానుంది. సీబీఎస్ఈ ఫలితాల రీవాల్యుయేషన్ ఫలితాలు రాగానే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చినప్పటికీ… ఇంకా ర్యాంకులను వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెలాఖరులోగా ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గత నెల మే 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,29,474 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం…. జూన్ 1 నాటికే ఈ ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఇంకా విడుదల లేదు. దీంతో విద్యార్థులు… ర్యాంకుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఏపీ ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఫలితంగా విద్యార్థుల ర్యాంకులను ఖరారు చేసేందుకు ఇంటర్ మార్కుల డేటా తప్పనిసరిగా మారంది. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (బెటర్మెంట్) పరీక్షలకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించింది. ఈ పరీక్షల ఫలితాలు జూన్ 18న విడుదలయ్యాయి. దీంతో ఆ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని ఒకటి రెండు రోజుల్లోనే ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలా కుదరలేదు.
ఈ నెలాఖరు వరకు ఫలితాలు…!
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ దరఖాస్తు గడువు జూన్ 7తో ముగిసింది. ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తికావడానికి సమయం పడుతుండటంతో….. రివైజ్డ్ ఫలితాలు ఈ నెలాఖరు నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ నుంచి కూడా పలువురు విద్యార్థులు… ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు వీరి సంఖ్య 8 వేల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఏ ఒక్క విద్యార్థికీ వెయిటేజీ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాలు బోర్డు నుంచి అందగానే…. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈఏపీ సెట్ ర్యాంకులను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని సూచిస్తున్నారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ - 2026కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది ఈఏపీసెట్ పరీక్షలు రాశారు. అంటే మొత్తం 92.60 శాతం హాజరు నమోదైంది.
- ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC స్ట్రీమ్) : ఈ విభాగానికి అత్యధికంగా 2,76,576 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ విభాగంలో అత్యధికంగా 93.48 శాతం హాజరు నమోదైంది.
- వ్యవసాయ, ఫార్మసీ (BiPC స్ట్రీమ్) : అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి మొత్తం 79,227 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ స్ట్రీమ్లో 89.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ర్యాంకుల విడుదల తర్వాత….. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తుంది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

