ఇక్కడ బర్డ్‌ ఫ్లూ కలకలం.. ప్రభుత్వం చర్యలు.. ఈ గ్రామాల నుంచి టెస్టింగ్‌కి నమూనాలు

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. కొన్ని గ్రామాల్లో బర్డ్‌ ఫ్లూ ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published on: Feb 9, 2026, 16:27:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం అమ్మగారిపల్లి, పుత్తవారిపల్లి గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు పశుసంవర్థక శాఖ నిర్ధారించింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కొన్ని ప్రాంతాలలో కోళ్లు మరణించినట్లుగా తెలుస్తోంది. దీనితో పశుసంవర్ధక శాఖ భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పరీక్షల కోసం నమూనాలను పంపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అన్నమయ్య జిల్లాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులు నిర్ధారించారు. శనివారం దాదాపు 40, ఆదివారం దాదాపు 50 నాటుకోళ్లు చనిపోయాయని అధికారులు తెలిపారు. పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లెలో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టుగా గుర్తించారు.

'అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం అమ్మగారిపల్లి, పుత్తవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన బర్డ్ ఫ్లూ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను నియమించింది.' అని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు.

NIHSAD ప్రయోగశాల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా ఫిబ్రవరి 8న ఈ వ్యాధి కన్ఫామ్ అయింది. ఆ తర్వాత విధానాలకు అనుగుణంగా తక్షణ నియంత్రణ చర్యలు ప్రారంభించామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఆర్‌టీలను మోహరించామని, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల సమన్వయంతో తొలగింపు కార్యకలాపాలు జరిగాయని మంత్రి తెలిపారు.

ప్రజల భయపడొద్దని మంత్రి కోరారు. వైరస్ పక్షులను మాత్రమే ప్రభావితం చేస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు. సరిగ్గా ఉడికించిన కోడి మాంసం, గుడ్లు తినడం పూర్తిగా సురక్షితమని తెలిపారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలంలో ఆకస్మాత్తుగా కోళ్లు మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి, నమూనాలను పరీక్ష కోసం NIHSADకి పంపారు. సదుం, కార్వేటినగరం మండలాల నుండి అదనపు నమూనాలను కూడా భోపాల్ ప్రయోగశాలకు పంపారు. అధికారులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సిబ్బందికి మరియు రైతులకు వ్యాధి నియంత్రణ ప్రోటోకాల్‌లను సూచించారని, ఏదైనా అసాధారణ పక్షుల మరణాలను వెంటనే నివేదించాలని కోళ్ల పెంపకందారులను కోరారు.

మదనపల్లె మండలం కొత్తవారిపల్లెలో కూడా కోళ్లు చనిపోయాయి. ఈ నమూనాలను కూడా టెస్టింగ్ కోసం పంపారు. మదనపల్లెలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. అనుమానాలు ఉంటే 7013914401, 9398262752 నెంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. బాగా ఉడికించిన చికెన్, గుడ్లు తినడం సురక్షితమని, సగం వండిన మంసాన్ని తినవద్దని అధికారులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More