రెండేళ్లలో అమరావతి నెక్స్ట్ లెవల్.. క్వాంటం కంప్యూటర్ల తయారీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్కు శంకుస్థాపన చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడి నుంచి క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయని వెల్లడించారు. మనమే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని తెలిపారు.
సచివాలయంలో మంత్రులు, పలు శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా హాజరయ్యారు. జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతి మీద చంద్రబాబు చర్చించారు. రియల్టైమ్ గవర్నెన్స్లో భాగంగా సాంకేతికతతో పాటు అవేర్, డేటా లీక్, పాలనలో ఏఐ టూల్స్ వినియోగం, కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్ ప్లాన్, యువతకు నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం మీద మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించేవారు కాదని, ఇప్పుడు మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ నెలా.. రెండుసార్లు మంత్రివర్గ భేటీ జరుగుతోందన్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు సమర్థంగా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తొందన్నారు. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్కు శంకుస్థాపన చేశామన్నారు. రెండేళ్లలో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయన్నారు. మనమే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని తెలిపారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెద్ద మార్పులు వస్తాయని వెల్లడించారు.
ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి, క్షేత్రస్థాయిలో పనుల్ని బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా 2సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలి. గత 19 నెలల్లో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలి. క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో ఉపకరణాలను కూడా తయారు చేసుకుని ఎగుమతులు చేసే పరిస్థితి వస్తుంది.' అని చంద్రబాబు అన్నారు.
ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి... పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏమేరకు చేరుకున్నామన్న అంశంపై స్పష్టతతో ఉంటున్నామన్నారు.
గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశామని, వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని సీఎం చంద్రబాబు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో వేశామన్నారు.
స్త్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మొబిలిటి పెరిగిందని, 4.29 కోట్ల ప్రయాణాలు ఇప్పటి వరకూ జరిగాయని, ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఆక్యుపెన్సీ పెరిగిందని చంద్రబాబు తెలిపారు.
'అన్నదాత సుఖీ భవ ద్వారా రూ. 6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ ఉత్పత్తి చేసేలా అవగాహన పెంచుతున్నాం. రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం. రైతు ఆత్మహత్యలనేవి జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం... ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే... వాటిని అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నాం. దీపం.2.0 ద్వారా 2 కోట్ల సిలెండర్లు ఇప్పటి వరకూ ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం. సంక్షేమ పథకాలు అవసరమా...? అనే చర్చ సరి కాదు... పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే.' అని చంద్రబాబు అన్నారు.

E-Paper












