మూడో సంతానానికి 30 వేలు, నాలుగో సంతానానికి రూ. 40 వేల ప్రోత్సాహకం - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP govt population growth Policy :ఏపీలో పడిపోతున్న జనాభా వృద్ధి రేటును అరికట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు, నాలుగో సంతానానికి రూ.30,000 నుంచి రూ.40,000 వరకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు.
Andhra Pradesh population growth Policy : రాష్ట్ర జనాభా సమతుల్యత విషయంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (Fertility Rate) వేగంగా పడిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణిని తిప్పికొట్టేందుకు, ఇకపై మూడు లేదా నాలుగో సంతానాన్ని కనే దంపతులకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు.

నగదు ప్రోత్సాహకాలు…
ఈ నూతన పాలసీ ప్రకారం…. కుటుంబంలో మూడో (సంతానం) జన్మిస్తే తక్షణమే రూ.30,000, అలాగే నాలుగో బిడ్డ జన్మిస్తే రూ.40,000 నగదు సహాయాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలను, సమగ్ర వివరాలను నెల రోజుల్లోగా అధికారికంగా విడుదల చేస్తామన్నారు. గతంలో రెండు సంతానానికి రూ.25,000 ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం యోచించినప్పటికీ… జనాభా సంక్షోభం తీవ్రతను బట్టి దీనిని మూడు, నాలుగు సంతానానికి కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జనాభా నియంత్రణ చర్యలను తాను ఒకప్పుడు సమర్థించినప్పటికీ…. జననాల రేటును పెంచడానికి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం అన్నారు. మూడో సంతానం, అంతకు మించి ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం పీటీఐకి తెలిపారు.
పిల్లలను భారంగా భావించొద్దు - సీఎం
సమాజంలో ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ చాలా మంది దంపతులు ఒకే బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని, కొందరు మొదటి సంతానంగా ఆడపిల్ల పుడితేనే రెండో సంతానం వైపు మొగ్గు చూపుతున్నారని సీఎం విశ్లేషించారు. దీనివల్ల రాష్ట్రంలో జనాభా భర్తీ స్థాయి (Replacement-level Total Fertility Rate) 2.1 కంటే దిగువకు పడిపోతోందని హెచ్చరించారు. ఒక సమాజం లేదా దేశం స్థిరంగా, ఆర్థికంగా బలంగా ఉండాలంటే ప్రతి మహిళకు సగటున 2.1 సంతానోత్పత్తి రేటు ఉండటం తప్పనిసరని స్పష్టం చేశారు.పిల్లలను భారంగా భావించవద్దని, వారే దేశానికి అసలైన సంపద అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 అందించే ‘తల్లికి వందనం’ సంక్షేమ పథకంపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆ దేవుడి దయ ఉండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఈ సాయాన్ని భవిష్యత్తులో మరింత పెంచుతాం," అని భరోసా ఇచ్చారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఎలాంటి ట్యాంపరింగ్కు అవకాశం లేని సరికొత్త ‘పట్టాదార్ పాస్బుక్’లను ముద్రిస్తున్నామని, మార్చి 2027 నాటికి రాష్ట్రంలో ఎలాంటి భూ వివాదాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాను మౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి నిర్దిష్ట కాలపరిమితులను (డెడ్లైన్స్) ప్రకటించారు:
- మడ్డువలస స్టేజ్-II ప్రాజెక్టు: జనవరి 2027 నాటికి పూర్తి.
- హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు: ఏప్రిల్ 2027 నాటికి పూర్తి.
- తోటపల్లి డిస్ట్రిబ్యూటరీలు (కాలువలు): జూలై 2027 నాటికి భక్తులకు, రైతులకు అందుబాటులోకి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన 86 లక్షల టన్నుల పాత వ్యర్థాలను విజయవంతంగా క్లియర్ చేశామని, జూన్ నాటికి వంద శాతం వ్యర్థాల నిర్మూలన పూర్తి చేస్తామని చెప్పారు.
అంతర్జాతీయంగా అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య నడుస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల తలెత్తే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకాలను అనుసరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

