ఆంధ్రలో మొంథా తుపాను బీభత్సం- కోనసీమ జిల్లాలో ఒక మహిళ మృతి..
ఆంధ్రలో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కోనసీమ జిల్లాలో ఒక మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు.
మొంథా తుపాను మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ఈ తుపాను కారణంగా రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలో కూడా దీని ప్రభావం గట్టిగా కనిపించింది. అక్కడ ఏకంగా 15 జిల్లాల్లో సాధారణ జీవనం దెబ్బతింది.

మొంథా తుపాను భీకర ప్రభావం వల్ల కోనసీమ జిల్లాలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. గాలివానకు ఓ వృద్ధురాలి ఇంటిపై కొబ్బరిచెట్టు కూలడంతో ఆమె మరణించింది. అదే జిల్లాలో బలమైన గాలుల ధాటికి కొబ్బరి చెట్లు కూలిపోయిన మరో ఘటనలో ఒక బాలుడు, ఒక ఆటో డ్రైవర్ గాయపడ్డారు.
తీరాన్ని తాకిన మొంథా తుపాను- భారీ నష్టం!
మొంథా తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని దాటింది.
ఈ తుపాను రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 403 మండలాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో, అత్యధిక ప్రభావం ఉన్న కాకినాడ, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు, రంపాచోడవరం డివిజన్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం రాత్రి 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 6:00 గంటల వరకు ఈ ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
లోతట్టు ప్రాంతాలు, నీట మునిగిన ప్రాంతాల్లోని వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐఎండీ రైతులను హెచ్చరించింది. పొలాల్లోని అదనపు నీటిని వీలైనంత వరకు బయటకు పంపేయాలని రైతులకు సూచించారు.
ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ బులెటిన్లను గమనిస్తూ ఉండాలని, తమ భద్రత కోసం ప్రభుత్వం జారీ చేసే సూచనలను తప్పక పాటించాలని కోరారు.
మొంథా తుపాను- అత్యవసర ఏర్పాట్లు, భారీ వర్షపాతం..
మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిరంతరాయ కమ్యూనికేషన్ కోసం 81 వైర్లెస్ టవర్లు, 21 పెద్ద దీపాలను సిద్ధం చేశారు. కూలిపోయిన చెట్లను తొలగించడానికి 1,447 ఎర్త్మూవర్లు, 321 డ్రోన్లు, 1,040 చైన్సాలు సిద్ధంగా ఉంచారు. ముందస్తు జాగ్రత్తగా, రాష్ట్రవ్యాప్తంగా నివాసితులకు 3.6 కోట్ల అలెర్ట్ సందేశాలను పంపించారు.
మంగళవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు:
- నెల్లూరు జిల్లాలో ఉలవపాడులో 12.6 సెంటీమీటర్లు
- కావలి 12.2 సె.మీ, దగ్గదర్తి 12 సె.మీ, సింగరాయకొండ 10.5 సె.మీ
- బి. కోడూరు 6 సె.మీ, విశాఖపట్నం, తునిలో 2 సె.మీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నెల్లూరు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


