AP Heatwave Alert : ఏపీకి తీవ్ర వడగాల్పుల హెచ్చరిక - 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు..!
Andhra Pradesh Heatwave Alert : రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఇవాళ పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Andhra Pradesh Heatwave Alert : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు ముదురుతోంది. భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్ట స్థాయికి చేరుకుంటాయని... ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది.

ఈ జిల్లాలకు హెచ్చరికలు…
ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి ఏకంగా 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుండి 44 డిగ్రీల వరకు రికార్డయ్యే ఛాన్స్ ఉంది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా.
71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు:
ఉష్ణోగ్రతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కూడా ప్రమాదకరంగా మారనుంది. రాష్ట్రంలోని మొత్తం 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో 20 మండలాలు, శ్రీకాకుళంలో 18, కాకినాడలో 9, కోనసీమలో 7, విజయనగరంలో 6, పోలవరంలో 4, విశాఖపట్నంలో 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇవి కాకుండా మరో 277 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పగటిపూట ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా నిరంతరం మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం వంటివి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

