రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసేకరణ త్వరలో ప్రారంభం
రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రెండో దశ భూ సమీకరణను ఆమోదించింది. మంగళవారం పరిపాలనా అనుమతులు, ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టడానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీకి అధికారం ఇచ్చారు.

ఈ ఉత్తర్వు ప్రకారం, సీఆర్డీఏ ఏడు గ్రామాలలో 16,666.57 ఎకరాల పట్టా (ప్రైవేట్), అసైన్డ్ భూములను సమీకరిస్తుంది. రెండో దశ భూ సమీకరణ పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలను కవర్ చేస్తుంది. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో నాలుగు గ్రామాలను గుర్తించారు. అవి వైకుంఠపురంలో 1,965 ఎకరాల పట్టా భూమి, పెదమద్దూరులో 1,018 ఎకరాల పట్టా భూమి, యండ్రాయిలో 1,879 ఎకరాల పట్టా భూమి, 46 ఎకరాల అసైన్డ్ భూమి, కర్లపూడి, లేమల్లలో 2,603 ఎకరాల పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నాయి.
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు జాబితా చేశారు: వద్దమానులో 1,763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. హరిశ్చంద్రపురంలో 1,448.09 ఎకరాల పట్టా భూమి, 2.29 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి ఉంది.
మొత్తం మీద, ప్రభుత్వం 16,562.52 ఎకరాల పట్టా భూమిని, 104.01 ఎకరాల అసైన్డ్ భూమిని, మొత్తం 16,666 ఎకరాలకు పైగా సమీకరించాలని సీఆర్డీఏని ఆదేశించింది. ఇందులో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఇది మొత్తం సముదాయ ప్రణాళికలో భాగం. ఈ చర్య అమరావతి అభివృద్ధిలో కొత్త ఊపును ఇస్తుందని అధికారులు అంటున్నారు. భూసేకరణ ద్వారా రాజధాని నగర నిర్మాణాన్ని వేగవంతం చేయాలనే ప్రభుత్వం భావిస్తోంది.













