ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

Published on: Dec 31, 2025 4:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన స్థితిలో శివలింగం కనిపించడం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు ద్రాక్షారామం భీమేశ్వరాలయం ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని ధ్వంసం చేశాడు.

ద్రాక్షారామం
ద్రాక్షారామం

భక్తులు గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోనేరులో స్నానం చేసి, శివలింగానికి పూజలు చేస్తారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన శివలింగాన్ని చూసిన భక్తులు ఆలయ పూజారులకు సమాచారం అందించారు. స్థానికంగా ఈ విషయంపై కలకలం రేగింది. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మీనా, నిందితుడిని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆలయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

నిందితుడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. డ్రైనేజీ వివాదం నేపథ్యంలో ఆలయ సిబ్బందికి ఇబ్బందులు కలిగించాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టుగా గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అంతకుముందు ఆధారాలు సేకరించారు. ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల పరిశీలించారు. నిందితుడు శీలం శ్రీనివాస్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.

ద్రాక్షారమం భీమేశ్వర ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారని, అతడిని అరెస్ట్ చేసినట్టుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. అధికారులు వెంటనే ఆలయంలో నూతన శివలింగాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు చేపట్టారన్నారు. నంద్యాలలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి వస్తువులు పెట్టిన విషయంపై కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను విచారణ అధికారిగా నియమించామన్నారు. వెండి ఆభరణాలు తిరిగి స్వామివారికి చేరే వరకు తప్పు చేసినవారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

'సింహాచలం అప్పన్న స్వామిల ఆలయం ప్రసాదంలో పురుగు రావడాన్ని గుర్తించి తెలిపిన భక్తుడితో ఆలయ ప్రసాదం కౌంటర్ ఉద్యోగి దురుసుగా ప్రవర్తించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఆలయాల పరిరక్షణ, సామాన్య భక్తుల భద్రత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.' అని దేవాదాయ శాఖ మంత్రి చెప్పారు.

మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు, మంగళవారం రాత్రి ఆలయ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు రామనారాయణ రెడ్డి.. ముఖ్యమంత్రికి తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో భద్రతను పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ ఆలయం పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుందని, పోలీసులు మరియు పురావస్తు శాఖ మధ్య సమన్వయం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. ఆలయాల పవిత్రతను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.