సంక్రాంతి రద్దీ కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. తేదీలు చూసుకోండి
సంక్రాంతి పండు రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) విశాఖపట్నం-విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. రిజర్వేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పండుగను జరుపుకోవడానికి స్వస్థలాలకు వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను తగ్గించడం దీని లక్ష్యం అని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం వంటి కీలక స్టేషన్లలో ఆగుతాయి, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి.
ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీలలో నడుస్తాయి. ముఖ్యంగా పండుగకు సరిగ్గా ముందు ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రైళ్లలో జనరల్ కోచ్లు ఉంటాయి. దీనివల్ల కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు పండుగల కోసం తమ గ్రామాలకు వెళ్లడం సులభం అవుతుంది.
ఈ కాలంలో రోడ్లు, ఇతర రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నందున, రైల్వే అధికారులు తమ ప్రణాళికలో ప్రయాణికుల భద్రత, సౌలభ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. రైలు సమయాలు, అదనపు సమాచారం కోసం ప్రయాణికులు సమీప రైల్వే స్టేషన్లను సంప్రదించాలని లేదా అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని చెబుతున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 10 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ స్పెషల్ రైళ్లు జనవరి 13,18,19 తేదీల్లో ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతాయి. 17,19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.
హైదరాబాద్ - విజయవాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఘన్ పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతాయి. జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి.