రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులు… ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
ఇదే నెలలో మరో విడత కూడా…

15 నుంచి 17 ఏళ్ల మధ్య వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవడానికి వీలుగా ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. అలాగే ఈ నెల 16 నుంచి 20 వరకు మరో విడత కూడా…. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇంకా చాలా మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఆప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక పిల్లల ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత పత్రాలను తీసుకెళ్లాలి. అంతేకాకుండా దరఖాస్తు ఫారం ఉండాలి.
పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్కు తీసుకెళ్లాలి. చిన్నారులను ఆధార్ సెంటర్కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇక్కడ పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి. ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే సరిచేసుకునే వీలు ఉంటుంది.
బాల్యంలో ఆధార్ జారీ చేసేటప్పుడు… పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో వంటి వివరాలను మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా అందుబాటులోకి రాదు. పాఠశాల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు, డీబీటీ వంటి సేవలలో పిల్లలకు ఇది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ అవసరం. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులు చెబుతున్నారు.