AP TG Weather Report : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, ఈ జిల్లాలకు హెచ్చరికలు
AP Telangana Weather Report : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.
AP Telangana Weather Report : నైరుతి రుతుపవనాల కదలికలకు తోడు వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో పాటు స్థిరంగా ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడు నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

తెలంగాణలో వర్షాలు - ఐఎండీ అంచనాలు :
తెలంగాణ వ్యాప్తంగా జూలై 21 నుండి జూలై 24 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంతి మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- జూలై 21వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- జూలై 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఈనెల 25వ తేదీ వరకు కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.
ఏపీలోనూ వర్షాలు - అంచనాలు ఇలా :
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం పరిధిలో రాగల మూడు రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం : ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూనే ఉంటాయి.
- దక్షిణ కోస్తా : ఇవాళ, రేపు కూడా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి.
- రాయలసీమ : ఇవాళ, రేపు కూడా వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

