టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన బర్డ్ ఆసుపత్రి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలోని కొన్ని ముఖ్యాంశాలు
- బర్డ్ ఆసుపత్రిలో ఆర్థో, ఇన్ పేషంట్ సేవలను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మరింత మంది డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియామకం.
- భద్రత, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
- డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కలిగి ఉండి, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగులలో ఏటా 100-150 మంది రోగులకు అయ్యే పూర్తి ఖర్చును భరించడానికి ముందుకు వచ్చిన చెన్నైకి చెందిన గువీ హెల్త్ కేర్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవడం.

అంతకుముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు పలు అంశాలపై చర్చించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్, సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యులు జానకి దేవి, నరేష్ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా.జగదీశ్, హెచ్డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు శ్రీవారి ఆలయ ప్రాంగణం, లడ్డూ కౌంటర్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై శ్రీవారి ఆలయం వద్ద వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దర్శన క్యూలైన్లలో ఎలాంటి అసౌకర్యానికి తావు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని భక్తులు ఛైర్మన్ వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం లడ్డూ కౌంటర్ వద్దకు చేరుకున్న ఛైర్మన్ లడ్డూ విక్రయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని, కావాల్సినన్ని లడ్డూలు దొరుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రోజుకు 4.80 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నట్లు ఛైర్మన్కు వివరించారు. అన్ని కౌంటర్లు తెరిచి ఉంచి ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు లడ్డూలు విక్రయించాలని అధికారులను ఆదేశించారు.