టీటీడీ : తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది. ధనుర్మాసం ఘడియలు ముగియడంతో సుప్రభాత సేవ మెుదలైంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ముగింపుతో గురువారం నుండి తెల్లవారుజామున సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం అయింది. పవిత్రమైన ధనుర్మాసం కాలంలో రోజువారీ సుప్రభాతం స్థానంలో ఆండాళ్ తిరుప్పావై పారాయణం కొనసాగింది. డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు పూజారులు, వేదపండితులు వెంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఆండాళ్ దేవత కూర్చిన 30 పాసురాలను పారాయణం చేశారు. బుధవారం ధనుర్మాసం ఘడియలు ముగియడంతో గురువారం నుండి తిరుమల ఆలయంలో సాధారణ ఆచార షెడ్యూల్కు తిరిగి కొనసాగుతోంది. అందులో భాగంగా సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది.

పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి విచ్చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
గోపూజ మహోత్సవం
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 5 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం, పూజ, హారతి కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10.30 గం.ల నుండి 11.15 గం.ల వరకు గోపూజ, కటమ, అశ్వ, వృషభ, గజ పూజ జరుగనుంది.
తదుపరి 11.15 గం.లకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లం, బియ్యం, గ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరింది.

E-Paper












