Kamal Haasan: కమల్ హాసన్‌కు ఇమేజ్ పిచ్చి, కావాలనే వివాదాలు సృష్టిస్తాడు-చిరంజీవి రీమేక్ మూవీ సీన్ మార్పుపై నటుడి ఆరోపణలు

Actor Yatin Karyekar On Kamal Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రవర్తనపై బాలీవుడ్ సీనియర్ నటుడు యతిన్ కార్యేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' తమిళ రీమేక్ 'వసూల్ రాజా ఎంబీబీఎస్' షూటింగ్ సమయంలో తన ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు కమల్ కీలక సీన్లను మార్పించేశారని ఆరోపించారు.

Published on: Jul 3, 2026, 21:25:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actor Yatin Karyekar On Kamal Haasan: భారతీయ సినిమా రంగంలో లోకనాయకుడిగా కమల్ హాసన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అద్భుతమైన నటనతో మెప్పించే ఆయన పనితీరుపై పరిశ్రమలో రకరకాల చర్చలు జరుగుతుంటాయి.

కమల్ హాసన్‌కు ఇమేజ్ పిచ్చి, కావాలనే వివాదాలు సృష్టిస్తాడు-చిరంజీవి రీమేక్ మూవీ సీన్ మార్పుపై నటుడి ఆరోపణలు
కమల్ హాసన్‌కు ఇమేజ్ పిచ్చి, కావాలనే వివాదాలు సృష్టిస్తాడు-చిరంజీవి రీమేక్ మూవీ సీన్ మార్పుపై నటుడి ఆరోపణలు

అయితే, బాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యతిన్ కార్యేకర్ తాజాగా కమల్ హాసన్ వ్యక్తిత్వం, సినిమా సెట్స్‌లో ఆయన ప్రవర్తనపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ తీవ్రమైన ఆత్మస్తుతి (Self-obsessed) ఉన్న వ్యక్తని, తన ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం కథలో మార్పులు చేయడానికి కూడా వెనుకాడరని పేర్కొన్నారు.

చిరంజీవితో శంకర్ దాదా ఎంబీబీఎస్

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో సంజయ్ దత్ నటించిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో ఇదే సినిమాను కమల్ హాసన్ 'వసూల్ రాజా ఎంబీబీఎస్' పేరుతో రీమేక్ చేశారు.

హిందీ వెర్షన్‌లో నటించిన యతిన్ కార్యేకర్, తమిళ రీమేక్‌లోనూ అదే పాత్రను పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలను సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యతిన్ పంచుకున్నారు.

చెంపదెబ్బ సీన్ నెట్టేయడంగా మారింది!

హిందీ ఒరిజనల్ చిత్రంలో జిమ్మీ షెర్గిల్ పాత్ర సంజయ్ దత్‌ను చెంపదెబ్బ కొట్టే ఒక కీలకమైన, భావోద్వేగ సీన్ ఉంటుంది. ఆ సీన్ కథను పెద్ద మలుపు తిప్పుతుంది. అయితే తమిళ రీమేక్ షూటింగ్ సమయంలో కమల్ హాసన్ ఆ సీన్ చేయడానికి నిరాకరించారని యతిన్ వెల్లడించారు.

"కమల్ హాసన్‌కు తన ఇమేజ్ గురించి విపరీతమైన పిచ్చి ఉంది. వసూల్ రాజా ఎంబీబీఎస్ షూటింగ్ సమయంలో జిమ్మీ షెర్గిల్ పాత్ర సంజయ్ దత్‌ను కొట్టే సీన్‌ను తమిళంలో రీక్రియేట్ చేయాల్సి ఉంది. కానీ, కమల్ హాసన్ తనను ఎవరూ స్క్రీన్‌పై కొట్టడానికి ఒప్పుకోలేదు. ఆ చెంపదెబ్బ సీన్‌ను కేవలం తోసేయడంగా మార్పించేశారు" అని యతిన్ కార్యేకర్ ఆరోపించారు.

ఈ మార్పు గురించి చర్చ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్లు ఎంతో టెన్షన్ పడ్డారని ఆయన గుర్తుచేసుకున్నారు. సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోనే కథ కోసం ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు, కమల్ హాసన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో తనకు అర్థం కాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తండ్రీకొడుకుల ఎమోషన్ పండలేదు

హిందీ చిత్రంలో సునీల్ దత్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయి. తండ్రి పాత్రకున్న గాంభీర్యం ఆ సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. తెలుగులోనూ గిరీష్ కర్నాడ్, చిరంజీవి మధ్య ఆ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. కానీ, తమిళ వెర్షన్‌లో ఆ ఎమోషనల్ డెప్త్ పూర్తిగా లోపించిందని యతిన్ అభిప్రాయపడ్డారు.

"సినిమాలో తండ్రి పాత్రలో ఉన్న ఏ నటుడు కూడా కమల్ హాసన్‌ను గద్దించి మాట్లాడలేకపోయారు" అని ఆయన అన్నారు. కమల్ హాసన్ ముందు నిలబడి ఆ క్యారెక్టర్‌ను డామినేట్ చేసే నటుడు ఎవరూ లేకపోవడం వల్ల, హిందీలో ఉన్నంత తీవ్రత తమిళంలో రాలేదని, అది కేవలం ఒక కామెడీ సీన్‌లా మారిపోయిందని విశ్లేషించారు.

పబ్లిసిటీ కోసం వివాదాలు!

కమల్ హాసన్ కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ లైమ్‌లైట్‌లో ఉండటానికి కావాలనే వివాదాలను సృష్టిస్తారని యతిన్ కార్యేకర్ మరో బాంబు పేల్చారు. గతంలో తామిద్దరం కలిసి పనిచేసిన 'హే రామ్' సినిమా షూటింగ్ నాటి ఒక ఘటనను ఆయన ప్రస్తావించారు.

ఒకసారి విమానం ఆలస్యమైనందుకు నిరసనగా కమల్ హాసన్ రన్‌వేపై ఏకంగా విమానం ముందే కూర్చుని ధర్నా చేశారని, అది మీడియాలో పెద్ద సంచలనంగా మారిందని గుర్తుచేశారు. సినిమాలపై జనాల దృష్టి పడేలా చేయడానికే కమల్ ఇలాంటి పనులు చేస్తుంటారని యతిన్ విమర్శించారు.

ఆయన ప్రతిభను గౌరవిస్తాను

కమల్ హాసన్ ఒక అద్భుతమైన టెక్నీషియన్, గొప్ప దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన ప్రతిభను తాను ఎంతగానో గౌరవిస్తానని చెప్తూనే.. పబ్లిక్ ఇమేజ్ కోసం ఆయన అనుసరించే పద్ధతులు మాత్రం తనకు నచ్చవని యతిన్ స్పష్టం చేశారు.

కాగా, 2004లో విడుదలైన 'వసూల్ రాజా ఎంబీబీఎస్' చిత్రంలో కమల్‌తో పాటు ప్రభు, స్నేహ, ప్రకాష్ రాజ్, నగేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More