30 కోట్ల చీటింగ్ కేసు- డైరెక్టర్ విక్రమ్ భట్, ఆయన భార్యకు కోర్టులో చుక్కెదురు- బెయిల్ రెజెక్ట్- జైలులోనే భార్యాభర్తలు?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌లకు రాజస్థాన్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. రూ. 30 కోట్ల చీటింగ్ కేసులో అరెస్టయిన వీరికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేసింది.

Published on: Feb 01, 2026 8:56 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌లకు రాజస్థాన్ హైకోర్టులో శనివారం (జనవరి 31) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన రూ. 30 కోట్ల చీటింగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని వారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది. గతేడాది డిసెంబర్ 7న ముంబైలో అరెస్టయిన ఈ జంట ప్రస్తుతం ఉదయ్‌పూర్ జైలులో ఉన్నారు.

30 కోట్ల చీటింగ్ కేసు- డైరెక్టర్ విక్రమ్ భట్, ఆయన భార్యకు కోర్టులో చుక్కెదురు- బెయిల్ రెజెక్ట్- జైలులోనే భార్యాభర్తలు? (ANI Video Grab)
30 కోట్ల చీటింగ్ కేసు- డైరెక్టర్ విక్రమ్ భట్, ఆయన భార్యకు కోర్టులో చుక్కెదురు- బెయిల్ రెజెక్ట్- జైలులోనే భార్యాభర్తలు? (ANI Video Grab)

బెయిల్ నిరాకరణకు కారణాలేమిటి?

జస్టిస్ వినోద్ కుమార్ భర్వానీ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. నిందితులకు ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం ఏమాత్రం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ (SPP) బెయిల్ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, నిందితులను మరిన్ని వివరాల కోసం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన వాదించారు. ఒకవేళ ఇప్పుడు వారికి బెయిల్ ఇస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

అసలు కేసు నేపథ్యం ఇది..

ఉదయ్‌పూర్‌కు చెందిన 'ఇందిరా ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్' వ్యవస్థాపకుడు అజయ్ ముర్డియా ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రాజెక్టుల పేరుతో తన వద్ద నుంచి తీసుకున్న నిధులను విక్రమ్ భట్ దంపతులు దారి మళ్లించారని ముర్డియా ఆరోపించారు. సుమారు రూ. 30 కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నకిలీ బిల్లులు సృష్టించి తమ వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినిమా నిర్మాణం కోసం కేటాయించిన సొమ్మును, సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో విక్రమ్ భట్ దంపతులతో పాటు ఉదయ్‌పూర్‌కు చెందిన దినేష్ కటారియా, భట్ మేనేజర్ మెహబూబ్ అన్సారీలను కూడా రాజస్థాన్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

డిఫెన్స్ వాదన ఇలా

విక్రమ్ భట్ న్యాయవాది కమలేష్ దవే ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని, సరైన పత్రాలను పరిశీలించలేదని ఆయన వాదించారు.

"ప్రతి లావాదేవీ ఇరు పక్షాల ఆమోదంతోనే జరిగింది. ఎక్కడా నకిలీ బిల్లులు లేవు. ఒప్పందం ప్రకారం సినిమాలు నిర్మించే ప్రక్రియలోనే ఈ నిధుల వినియోగం జరిగింది" అని విక్రమ్ భట్ న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు.

క్రిమినల్ కేసు కాదని

కాగా, అంతకుముందు ఇది సివిల్ వివాదమని, క్రిమినల్ కేసు కాదని పేర్కొంటూ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని విక్రమ్ భట్ కోరగా, ఆ అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.

కేవలం నమ్మక ద్రోహమే కాకుండా, నిధుల మళ్లింపు (Misappropriation) కూడా జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని, కాబట్టి పోలీసు విచారణ ఆగకూడదని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విక్రమ్ భట్ దంపతులకు జైలు కష్టాలు తప్పేలా కనిపించడం లేదని తెలుస్తోంది.