OTT: థియేటర్లలో రిలీజ్ కానున్న తెలుగు సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్.. అదిరిపోయిన గ్లింప్స్ వీడియో

ఓటీటీలో సూపర్ హిట్ అయిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం మూడో సీజన్ థియేటర్లలోకి రానుండటం విశేషం. ఇదే విషయాన్ని చెబుతూ ఈటీవీ విన్ రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

Jan 23, 2026, 09:20:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్ లను సినిమాల రూపంలో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ మధ్య పలువురు మేకర్స్ చేస్తున్నారు. అయితే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన కానిస్టేబుల్ కనకం మూడో సీజన్ మాత్రం ఓటీటీలో కాకుండా థియేటర్లలోకి వస్తుండటం విశేషం.

OTT: థియేటర్లలో రిలీజ్ కానున్న తెలుగు సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్.. అదిరిపోయిన గ్లింప్స్ వీడియో
OTT: థియేటర్లలో రిలీజ్ కానున్న తెలుగు సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్.. అదిరిపోయిన గ్లింప్స్ వీడియో

కానిస్టేబుల్ కనకం ఛాప్టర్ 3

ఈటీవీ విన్ ఓటీటీ తీసుకొచ్చిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి కానిస్టేబుల్ కనకం. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కంటే ఈ మధ్యే వచ్చిన రెండో సీజన్ కు మరింత మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపులో ఇప్పుడు మూడో సీజన్ తీసుకురానున్నారు. అయితే దీనిని థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించడమే ఇక్కడ అసలు విశేషం.

ఇదే విషయాన్ని చెబుతూ ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (జనవరి 22) రాత్రి ట్వీట్ చేసింది. “స్టోరీ మరింత పెద్దదైంది. మిస్టరీ మరింత తీవ్రంగా మారింది. ఈ ఎక్స్‌పీరియన్స్ మరో స్థాయికి చేరింది. కానిస్టేబుల్ కనకం ఛాప్టర్ 3 గ్లింప్స్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అయిన ఇది త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నెక్ట్స్ బిగ్ ఛాప్టర్ కోసం సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్ వీడియో

ఈ కానిస్టేబుల్ కనకం ఛాప్టర్ 3 గ్లింప్స్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఖాల్ ఘాట్ అనే ప్రాంతంలో జరిగే స్టోరీగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దేవుడిని నమ్మేవాళ్లకు, అదే దేవుడిని ద్వేషించేవాళ్లకు మధ్య జరిగే పోరులో అమాయకులను కాపాడేందుకు ఆ దేవుడే ఓ మనిషిని పంపిచాడంటూ ఇందులోని లీడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంను పరిచయం చేశారు. ఈసారి వర్ష బొల్లమ్మ మరింత ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నట్లు గ్లింప్స్ చేస్తే స్పష్టమవుతోంది.

ఈ కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ లో వర్షతోపాటు రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, కంచరపాలెం కిశోర్, రాకేందు మౌళిలాంటి వాళ్లు నటించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ నిర్మించారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేశాడు.

కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కథ ఇదీ

కానిస్టేబుల్ కనకం ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 1990ల్లో శ్రీకాకుళంలోని రేపల్లెలో ఉన్న ఓ రహస్య ప్రదేశం అడవి గుట్టలో జరిగిన కథగా తెరకెక్కింది. అక్కడి మహిళలు కనిపించకుండాపోతుంటారు. ఆ కేసును స్థానిక కానిస్టేబుల్ అయిన కనక మహాలక్ష్మి (వర్ష బొల్లమ్మ) ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కథ మలుపు తిరుగుతుంది.

తన స్నేహితురాలు చంద్రిక కనిపించకుండా పోవడంతో కనకం రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయిలందరూ ఏమయ్యారు అన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. ఇప్పటికే రెండు సీజన్లు ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మూడో ఛాప్టర్ వచ్చే ముందే ఈ రెండు సీజన్లను చూసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More