Anurag Kashyap: బాలీవుడ్ త్వరగా లొంగిపోతుంది, సౌత్ సినిమా అస్సలు తగ్గదు, విష సంస్కృతి పెరిగింది: దర్శకుడు అనురాగ్ కశ్యప్

Anurag Kashyap About Bollywood Bends Easily To Power: అధికారంలో ఉన్న వ్యక్తులకు బాలీవుడ్ చాలా సులభంగా లొంగిపోతుందని దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ ఇండస్ట్రీలా కాకుండా దక్షిణాది పరిశ్రమ ఎందుకు లొంగదో వివరిస్తూ, బాలీవుడ్‌లోని స్వార్థపూరిత వాతావరణాన్ని అనురాగ్ కశ్యప్ ఎండగట్టారు.

Published on: Aug 17, 2026, 06:24:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anurag Kashyap About Bollywood Bends Easily To Power: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి బాలీవుడ్ వర్గాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందీ చలనచిత్ర పరిశ్రమ అధికారం, రాజకీయాల ఒత్తిళ్లకు చాలా త్వరగా లొంగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా నడుమ ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.

బాలీవుడ్ త్వరగా లొంగిపోతుంది, సౌత్ సినిమా అస్సలు తగ్గదు, విష సంస్కృతి పెరిగింది: దర్శకుడు అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ త్వరగా లొంగిపోతుంది, సౌత్ సినిమా అస్సలు తగ్గదు, విష సంస్కృతి పెరిగింది: దర్శకుడు అనురాగ్ కశ్యప్

ఒక్కసారి తలొంచితే.. ఇక అంతే!

ఒక్కసారి ఒత్తిళ్లకు తలొగ్గి రాజీపడటం మొదలుపెడితే, దాని నుంచి బయటకు రావడం సాధ్యం కాదని అనురాగ్ కశ్యప్ తెలిపారు. మొదటి రాజీ తర్వాత వచ్చే ప్రయోజనాలు, లాభాలకు అలవాటు పడిపోవడం వల్లే ఎవరూ ఆ తలుపులను మూసివేయలేకపోతున్నారని ఆయన చెప్పారు.

ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతారు

"సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తాము చేస్తున్న రాజీలు ఏంటో బాగా తెలుసు. చాలా సందర్భాల్లో వారు సిగ్గుపడతారు, అసౌకర్యంగా భావిస్తారు. కానీ, ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతారు. వ్యక్తిగతంగా తమను అడిగే వరకు ఎవరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏమీ చేయరు" అని అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు.

ఉత్తరాది మార్కెట్‌ను ఆక్రమించాలనుకునే

దక్షిణాది చిత్ర పరిశ్రమలు ప్రాదేశికంగా, సాంస్కృతికంగా ఎంతో బలంగా ఉన్నాయని అనురాగ్ కశ్యప్ కొనియాడారు. ఉత్తరాది మార్కెట్‌ను ఆక్రమించాలనుకునే కేంద్ర శక్తులు హిందీ ప్రేక్షకులపైనే ఎక్కువ దృష్టి పెడతాయని తెలిపారు.

సౌత్ సినిమా ఎందుకు తగ్గేదేలే అంటోంది?

"దక్షిణాది చిత్ర పరిశ్రమలకు ఉన్న సాంస్కృతిక మూలాలు చాలా బలంగా ఉంటాయి. పైగా సౌత్ ఇండస్ట్రీ హిందీ మార్కెట్‌పైనే పూర్తిగా ఆధారపడదు. అందుకే వాళ్లు ఎవరికీ లొంగిపోరు. కేవలం హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలని చూసే కొందరు మాత్రమే రాజీపడతారు" అని అనురాగ్ కశ్యప్ స్పష్టం చేశారు.

వందల కోట్లతో సౌత్ సినిమాలు

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ పాన్ ఇండియా స్థాయిలో జయభేరి మోగిస్తుంటే, బాలీవుడ్ మాత్రం సృజనాత్మకతను పక్కనపెట్టి కేవలం బాక్సాఫీస్ నంబర్ల వెంటే పరుగెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రూ.500 కోట్ల పిచ్చి.. ముంబై వదిలి బెంగళూరుకు!

బాలీవుడ్‌లో సృజనాత్మక వాతావరణం నశించిందని, ఎప్పుడూ రూ. 500 కోట్లు, రూ. 800 కోట్ల కలెక్షన్ల వెంటే పరుగెత్తే 'విష సంస్కృతి' (Toxic Culture) పెరిగిపోయిందని అనురాగ్ గతంలోనూ ఆరోపించారు. ఈ వాతావరణం నచ్చకనే తాను ముంబై నగరాన్ని వదిలి బెంగళూరుకు వెళ్లిపోతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

అనురాగ్ కశ్యప్ బందర్ సినిమా

ఇదిలా ఉంటే, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'బందర్'. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని, అనురాగ్ మార్క్ ఉత్తమ చిత్రంగా నిలిచినప్పటికీ, ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా కేవలం రూ. 4.97 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More