Peddi: పెద్ది ట్రైలర్‌లో అది పెద్ద పొరపాటు, ఇలాంటి తప్పులు అస్సలు జరగొద్దు- బుచ్చిబాబు కామెంట్స్- జగపతి బాబు ఏమన్నాడంటే?

Buchi Babu Sana On Peddi Trailer Mistake: రామ్ చరణ్ నటించిన రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమాకు నెగెటివిటీ వస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సాన సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ది ట్రైలర్‌లో చేసిన తప్పు గురించి, జాన్వీ కపూర్ క్యారెక్టర్ వివాదంపై బుచ్చిబాబు కామెంట్స్ చేశారు.

Published on: Jun 13, 2026, 14:14:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Buchi Babu Sana On Peddi Trailer Mistake: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' థియేటర్ల వద్ద భారీ అంచనాలతో విడుదలైంది. దానికి తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది పెద్ది.

పెద్ది ట్రైలర్‌లో అది పెద్ద పొరపాటు, ఇలాంటి తప్పులు అస్సలు జరగొద్దు- బుచ్చిబాబు కామెంట్స్- జగపతి బాబు ఏమన్నాడంటే?
పెద్ది ట్రైలర్‌లో అది పెద్ద పొరపాటు, ఇలాంటి తప్పులు అస్సలు జరగొద్దు- బుచ్చిబాబు కామెంట్స్- జగపతి బాబు ఏమన్నాడంటే?

మైత్రీ మూవీ మేకర్స్ ఇంటర్వ్యూ

అయితే, పెద్ది కలెక్షన్స్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని, విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు సాన మనసు విప్పి మాట్లాడారు.

మే 18న విడుదల చేసిన పెద్ది సినిమా ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే ప్రేక్షకుల నిరాశకు ప్రధాన కారణమని, ఎడిటింగ్‌లో తాము చేసిన పొరపాటే సినిమాపై ప్రతికూల ప్రభావం చూపిందని బుచ్చిబాబు సాన ఓపెన్‌గా అంగీకరించారు.

ట్రైలర్ ఎడిటింగ్‌లో పెద్ద పొరపాటు జరిగింది

1980ల నాటి పల్లెటూరి వాతావరణంలో, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా ప్రమోషన్ల విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో బుచ్చిబాబు వివరించారు. ఈ చర్చలో పాల్గొన్న సీనియర్ నటుడు జగపతి బాబుతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

"పెద్ద సినిమాలతో డీల్ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు జరగకూడదు. పెద్ది ట్రైలర్‌లో ఒకే సీన్‌లోకి చాలా ఎలిమెంట్స్‌ను దట్టించేశాం. అది ప్రేక్షకులకు సినిమా కథపై స్పష్టత ఇవ్వాల్సింది పోయి, మరింత కన్ఫ్యూజ్ చేసింది" అని బుచ్చిబాబు పేర్కొన్నారు.

ఒత్తిడిపై జగపతి బాబు

ఈ ఇంటర్వ్యూలో జగపతి బాబు కూడా సినిమా విడుదల సమయంలో అనుభవించిన ఒత్తిడి గురించి మాట్లాడారు. "సినిమా చుట్టూ విపరీతమైన నెగెటివిటీ నడిచింది. సినిమా బాగా ఆడాలని కోరుకునే వాళ్లు సైతం ఇది వర్కవుట్ కాదని కచ్చితంగా చెప్పారు. మొదట్లో నా అంచనాలను కూడా ఈ సినిమా అందుకోలేకపోవడంతో నేను నిరాశకు గురయ్యాను" అని జగపతి బాబు గుర్తుచేసుకున్నారు.

అయితే, పెద్ది సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోల ద్వారా పంచుకున్న రివ్యూలే సినిమాను నిలబెట్టాయని, వారి వల్లే 'మౌత్ టాక్' పెరిగి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారని బుచ్చిబాబు సాన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

జాన్వీ కపూర్ క్యారెక్టర్ వివాదం..

పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చుట్టూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఆమెపై చిత్రీకరించిన కొన్ని రొమాంటిక్ సీన్లు, ఆ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా (హైపర్ సెక్సువలైజేషన్) చూపించడంపై ప్రేక్షకులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా ప్రేక్షకుల నుంచి కూడా దీనిపై నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా రంగంలోకి దిగి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

"ఒక దర్శకుడిగా సినిమా అనేది ప్రేక్షకులను అలరించాలని, స్ఫూర్తినింపాలని నమ్ముతాను. అది ఎవరినీ ఇబ్బంది పెట్టేలా లేదా వారి గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదు. 'పెద్ది' సినిమాలోని కొన్ని సీన్లపై వచ్చిన విమర్శలను మేము చాలా తీవ్రంగా పరిగణించాం" అని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.

తప్పు సరిదిద్దుకునేందుకు

మహిళా పాత్రలను కించపరచాలనే ఉద్దేశం తమకు అస్సలు లేదని చెబుతూ, తప్పును సరిదిద్దుకునేందుకు చిత్ర యూనిట్ వేగంగా నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆ రొమాంటిక్ సీన్లను థియేట్రికల్ వెర్షన్ నుంచి ట్రిమ్ చేయడమో లేదా పూర్తిగా తొలగించడమో చేస్తున్నట్లు ప్రొడక్షన్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్

రామ్ చరణ్ క్రేజ్ కారణంగా ఈ పెద్ది చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. 9 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా పెద్ది సినిమాకు రూ. 366 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More