చదువులేకపోవడం వల్లే అంత పెద్ద తప్పు చేశాడు.. జైలులో ఉన్న స్టార్ కమెడియన్‌పై డైరెక్టర్ కామెంట్స్

చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ బాసటగా నిలిచారు. రాజ్‌పాల్ చిక్కుల్లో ఉన్నాడని తెలిసి, తన తదుపరి సినిమాలో విలన్ పాత్ర ఇవ్వడమే కాకుండా భారీ రెమ్యూనరేషన్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Feb 14, 2026, 13:13:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు పూయించే స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చెక్ బౌన్స్ కేసులో సెటిల్‌మెంట్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమవడంతో, ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో లొంగిపోయిన విషయం తెలిసిందే.

చదువులేకపోవడం వల్లే అంత పెద్ద తప్పు చేశాడు.. జైలులో ఉన్న స్టార్ కమెడియన్‌పై డైరెక్టర్ కామెంట్స్
చదువులేకపోవడం వల్లే అంత పెద్ద తప్పు చేశాడు.. జైలులో ఉన్న స్టార్ కమెడియన్‌పై డైరెక్టర్ కామెంట్స్

ఈ నేపథ్యంలో, రాజ్‌పాల్ యాదవ్‌కు అత్యంత ఆప్తుడైన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ స్పందించారు. తన మిత్రుడిని కాపాడుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను డైరెక్టర్ ప్రియదర్శన్ పంచుకున్నారు.

రాజ్‌పాల్ కోసం ప్రియదర్శన్ ఆవేదన

ప్రస్తుతం 'భూత్ బంగ్లా' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రియదర్శన్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "రాజ్‌పాల్ నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. 'జంగిల్' సినిమాలో అతడి నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి నా ప్రతి సినిమాలోనూ అతడు ఉండేలా చూసుకున్నాను" అని తెలిపారు.

విలన్‌గా కమెడియన్

"ప్రస్తుతం రాజ్‌పాల్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా, నా తదుపరి సినిమా నిర్మాతలతో (జుబిలీ ఫిల్మ్స్) మాట్లాడి, అతడికి రెగ్యులర్ ఛార్జ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరాను. అతడిని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలన్నదే మా లక్ష్యం. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించారు. ఈ సినిమాలో రాజ్‌పాల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు" అని దర్శకుడు ప్రియదర్శన్ తెలిపారు.

"రాజ్‌పాల్ యాదవ్ సమస్య గురించి నాకు తెలుసు. అందుకే అతనికి వరుసగా సినిమాలు వచ్చేలా చూసుకునేవాన్ని. అతన్ని యాడ్ ఫిల్మ్స్ చేసేలా కూడా నేను ప్రయత్నిస్తున్నాను. పాపం అతను పెద్దగా చదువుకోకపోవడం వల్లే అంత పెద్ద తప్పు చేశాడు. కానీ, రాజ్‌పాల్ చాలా మంచి వ్యక్తి" అని డైరెక్టర్ ప్రియదర్శన్ పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

ఇదిలా ఉంటే, రాజ్‌పాల్ యాదవ్ ఈ నెల 5వ తేదీన తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మరింత సమయం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

5 కోట్ల అప్పు

2010లో 'అతా పతా లాపతా' అనే సినిమాతో దర్శకుడిగా మారాలనుకున్న రాజ్‌పాల్ యాదవ్ మురళీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ నుంచి రూ. 5 కోట్లు అప్పు తీసుకున్నారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో రాజ్‌పాల్ యాదవ్ భారీ నష్టాల్లో కూరుకుపోయారు.

వడ్డీతో కలిపి 9 కోట్లు

చెల్లించిన చెక్కులు కూడా బౌన్స్ అవ్వడంతో 2018లో కోర్టు రాజ్‌పాల్ యాదవ్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాలక్రమేణా ఆ బాకీ మొత్తం వడ్డీతో కలిపి రూ. 9 కోట్లకు కోట్లకు చేరుకుంది.

అండగా నిలుస్తున్న సినీ పరిశ్రమ

రాజ్‌పాల్ యాదవ్ కష్టాల్లో ఉన్నాడని తెలిసి బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే నటుడు సోనూ సూద్ అతడికి సహాయం చేస్తానని ప్రకటించారు. వీరితో పాటు గుర్మీత్ చౌదరి, గురు రంధవా, మీకా సింగ్ వంటి సెలబ్రిటీలు కూడా రాజ్‌పాల్‌కు ఆర్థికంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

తెలుగులో కూడా

'ముజ్సే షాదీ కరోగీ', 'భూల్ భూలయ్యా', 'చుప్ చుప్ కే' వంటి చిత్రాలతో లక్షలాది మందిని నవ్వించిన రాజ్‌పాల్ యాదవ్ తెలుగులో రవితేజ కిక్ 2 మూవీలో కూడా కమెడియన్‌గా అలరించారు.