Rajini Kamal Sundar: రజనీ, కమల్ సినిమా నుంచి తప్పుకున్న సుందర్ సి- ఒత్తిడే కారణమన్న డైరెక్టర్- తలైవాకు ముందే చెప్పానంటూ!

Sundar C Reveals Leaving Rajinikanth Kamal Haasan Movie: ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా భావిస్తున్న 'తలైవర్ 173' నుంచి దర్శకుడు సుందర్ సీ తప్పుకోవడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన బయటపెట్టారు.

Published on: May 3, 2026, 06:51:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sundar C About Leaving Rajinikanth Kamal Haasan Movie: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇద్దరు ధ్రువతారలు సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే తెరపై కనిపిస్తే చూడాలని కోట్లాది మంది అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో 'తలైవర్ 173' (వర్కింగ్ టైటిల్) ప్రకటన వచ్చినప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఊగిపోయింది.

రజనీ, కమల్ సినిమా నుంచి తప్పుకున్న సుందర్ సి- ఒత్తిడే కారణమన్న డైరెక్టర్- తలైవాకు ముందే చెప్పానంటూ!
రజనీ, కమల్ సినిమా నుంచి తప్పుకున్న సుందర్ సి- ఒత్తిడే కారణమన్న డైరెక్టర్- తలైవాకు ముందే చెప్పానంటూ!

షాక్ ఇచ్చిన సుందర్ సి

2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని డైరెక్టర్, హీరోయిన్ ఖుష్బూ భర్త సుందర్ సీ దర్శకత్వం వహిస్తారని అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే 'అనివార్య కారణాల వల్ల' తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు సుందర్ సీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎందుకు తప్పుకున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుందర్ సి మౌనం వీడి దానికి అసలు కారణాన్ని చెప్పారు. మెగా ప్రాజెక్ట్ అయిన రజనీకాంత్, కమల్ హాసన్ సినిమా నుంచి తాను వైదొలగడానికి గల కారణాలను వివరిస్తూ.. ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నారు సుందర్ సి.

ఒత్తిడి భరించలేకే ఆ నిర్ణయం: సుందర్ సి

"నిజం చెప్పాలంటే, ఆ సినిమా విషయంలో నాపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ వస్తున్నాను. కానీ, ఇంత భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలను ఇతరులకు వివరించి ఒప్పించే సామర్థ్యం నాకు లేదనిపించింది. నాకు కథను అద్భుతంగా నెరేట్ చేయడం రాదు. అదే సమయంలో ఎవరైనా మార్పులు చెబితే ఎదురు తిరగకుండా వెంటనే రాజీ పడిపోతుంటాను" అని సుందర్ సి పేర్కొన్నారు.

రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఉన్నప్పుడు అది కేవలం తన ఒక్కడి నిర్ణయం మీద నడవదని సుందర్ సి గ్రహించారు. "అంత పెద్ద సినిమాలో నా సొంత నిర్ణయాలకు తావు ఉండదని అర్థమైంది. సినిమాకు గానీ, ఆ ఇద్దరు లెజెండ్స్‌కు గానీ నేను పూర్తి న్యాయం చేయలేనని గ్రహించి, అందుకే ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే తప్పుకున్నాను" అని సుందర్ సి వివరించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు స్వయంగా రజనీకాంత్‌ను కలిసి చర్చించానని కూడా వెల్లడించారు.

వారసత్వాన్ని అందుకున్న సిబి చక్రవర్తి

అంటే, ఆ సినిమా నుంచి తప్పుకోవడం గురించి తలైవా రజనీకాంత్‌కు ముందే చెప్పి సుందర్ సి వైదొలిగనట్లు తెలుస్తోంది. సుందర్ సి తప్పుకోవడంతో ఇప్పుడు ఈ భారీ చిత్ర బాధ్యతలను 'డాన్' మూవీ దర్శకుడు సిబి చక్రవర్తికి అప్పగించారు. ప్రస్తుతం రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2'లో నటించనున్నారు.

మరోవైపు కమల్ హాసన్ మణిరత్నం తెరకెక్కించిన 'థగ్ లైఫ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు కమల్ హాసన్. వీరిద్దరూ కలిసి నటించబోయే సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

తప్పుకోవడం కష్టమైన నిర్ణయమే!

గతంలో సుందర్ సీ విడుదల చేసిన నోట్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. "జీవితంలో కొన్నిసార్లు మన కలల కంటే వాస్తవాలనే అనుసరించాల్సి ఉంటుంది. రజనీ, కమల్ గార్లతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక. వారితో గడిపిన కొన్ని రోజులు నాకు ఎన్నో పాఠాలను నేర్పాయి. అది నా జీవితంలో ఒక కష్టమైన నిర్ణయం" అని అప్పట్లో పేర్కొన్నారు.

ఏది ఏమైనా సుందర్ సి తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకోడానికి గల అసలు కారణం చెప్పిన సుందర్ సి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More