Jr NTR Trivikram: వివాదంలో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్.. ఉత్తరాది వాడంటే ఊరుకోమన్న తమిళ రాజకీయన నేత!
Jr NTR Trivikram God Of War Controversy: జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రకటించిన కొత్త సినిమా చుట్టూ తమిళనాడులో తీవ్ర వివాదం చెలరేగుతోంది. తమిళుల ఆరాధ్య దైవం మురుగన్ చరిత్రను తప్పుగా చూపిస్తే థియేటర్లను నడవనివ్వమని ఎన్టీకే అధినేత సీమాన్ హెచ్చరించారు.
Jr NTR Trivikram God Of War Controversy: 'ఆర్ఆర్ఆర్', 'దేవర' చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజే సంచలనం సృష్టించింది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు వివాదం
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా కథాంశంపై పొరుగు రాష్ట్రం తమిళనాడులో అప్పుడే వివాదాల మంటలు రాజుకున్నాయి.
తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, నామ్ తమిళర్ కట్చి (NTK) అధినేత సీమాన్ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. కథలో తమిళ సంస్కృతిని కించపరిచినా, చరిత్రను మార్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఉత్తరాదిలో జన్మించాడు
ఈ వివాదానికి ప్రధాన కారణం జూన్ 29న చిత్ర బృందం విడుదల చేసిన అధికారిక ప్రకటన. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ పెట్టిన పోస్ట్ తమిళులకు ఆగ్రహం తెప్పించింది. ఆ పోస్ట్లో.. "ఉత్తరాదిలో జన్మించాడు.. దేశ హృదయభూమిలో రూపుదిద్దుకున్నాడు.. దక్షిణాదిలో పూజలందుకుంటున్నాడు.. ఇప్పుడు విశ్వానికి చెందాల్సిన కథగా వస్తున్నాడు" అని నాగవంశీ పేర్కొన్నారు.
ఈ క్యాప్షన్తో పాటు విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఇది తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్ (కార్తికేయుడు) కథ అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే, మురుగన్ ఉత్తరాదిలో జన్మించాడనే లైన్ తమిళులకు అస్సలు నచ్చలేదు. తమిళ సంస్కృతితో విడదీయరాని బంధం ఉన్న తమ దేవుడిని ఉత్తరాది వాడిగా చూపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాది సంస్కృతిని రుద్దకండి: సీమాన్
తమిళనాడు రాజకీయాల్లో సెంటిమెంట్ను బలంగా వినిపించే సీమాన్.. ఎన్టీఆర్ సినిమా టీమ్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కళ అనే ముసుగులో మురుగన్ ఉత్తరాది ప్రాంతాల్లో జన్మించాడనే అభూత కల్పనలను సృష్టించి తమపై రుద్దే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు.
"తమకంటూ ప్రత్యేక గుర్తింపు, సాంస్కృతిక అంశాలు, పూజా పద్ధతులు లేని కొన్ని శక్తులు.. శివుడు, మురుగన్, కణ్ణన్, తిరుమాల్, కొట్రవై వంటి తమిళ దేవుళ్లను దొంగిలించి తమవిగా చెప్పుకుంటున్నాయి. ప్రాచీన కాలం నుంచి తమిళ సంస్కృతి, జీవన విధానంతో మురుగన్ విడదీయరాని విధంగా కలిసిపోయారు. తమిళం అంటే మురుగన్.. మురుగన్ అంటే తమిళం. ఆ చరిత్రను విచ్ఛిన్నం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం" అని సీమాన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
థియేటర్లలో ప్రదర్శనను అడ్డుకుంటాం!
తమిళ సంస్కృతిని విస్మరించి, తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందిస్తున్న ఈ చిత్రం విడుదల అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సీమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని కోరారు.
ఒకవేళ చిత్ర యూనిట్ వెనక్కి తగ్గకపోతే, థియేటర్ల యజమానులు కూడా ఈ సినిమాను ప్రదర్శించకుండా నిషేధించాలని, లేదంటే ఊహించని పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
హిమాలయాల్లో జన్మించి, దక్షిణాదికి వచ్చినట్లు
నిజానికి, ఉత్తరాది పురాణాల ప్రకారం కార్తికేయుడు హిమాలయాల్లో జన్మించి, ఆ తర్వాత దక్షిణాదికి వచ్చినట్లు చెబుతారు. కానీ, తమిళ సంప్రదాయం ప్రకారం మురుగన్ పూర్తిగా తమిళ నేలకు (కురింజి ప్రాంతం) చెందిన స్థానిక దేవుడు. ఈ రెండు సంస్కృతుల మధ్య ఉన్న వ్యత్యాసమే ఇప్పుడు సినిమా చుట్టూ వివాదానికి దారితీసింది.
గాడ్ ఆఫ్ వార్కు రాజకీయ సెగ
'గాడ్ ఆఫ్ వార్' (God of War) అనే టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. సీమాన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై హీరో జూనియర్ ఎన్టీఆర్ గానీ, దర్శకుడు త్రివిక్రమ్ గానీ, నిర్మాత నాగవంశీ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్కు ప్రారంభంలోనే ఇలాంటి రాజకీయ సెగ తగలడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


