ప్రజాస్వామ్యంలో కళలు, కళాకారులకు విలువ లేకుండా పోతుంది: సెన్సార్ బోర్డుపై విరుచుకుపడ్డ కమల్ హాసన్
సినిమా సెన్సార్ ప్రక్రియపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో కళలు, కళాకారులకు విలువ లేకుండా పోతోందన్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చుట్టూ నెలకొన్న వివాదాల నేపథ్యంలో సీనియర్ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తీకరణ స్వేచ్ఛ, సినీ పరిశ్రమలో సెన్సార్ ప్రక్రియపై విస్తృతమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏ సంస్థ లేదా నిర్దిష్ట సినిమా పేరును ప్రస్తావించకుండా కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఇటీవల జన నాయగన్ సెన్సార్ ఇష్యూపైనా ఆయన స్పందించారని అర్థమవుతోంది.

కమల్ హాసన్ పోస్ట్
"భారత రాజ్యాంగం హేతుబద్ధతతో కూడిన వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. పారదర్శకత ఎన్నడూ తగ్గదు. ఇది కేవలం సినిమా గురించి మాత్రమే కాదు. అంతకంటే పెద్దది. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో మనం కళలకు, కళాకారులకు ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ విలువ లేకుండా పోతుంది. సినిమా కేవలం వ్యక్తి కృషి మాత్రమే కాదు.. రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, ప్రదర్శకులు, చిన్న వ్యాపారాల సమష్టి కృషి. వీరి జీవనోపాధి న్యాయమైన, సకాలంలో జరిగే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది" అని కమల్ హాసన్ ఫైర్ అయ్యారు.
సెన్సార్ ప్రక్రియ
ఈ విధమైన సెన్సార్ ప్రక్రియలు సృజనాత్మకతను అడ్డుకుంటాయని, సినీ పర్యావరణ వ్యవస్థలో జీవనోపాధిని దెబ్బతీస్తాయని నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. "స్పష్టత లేనప్పుడు, సృజనాత్మకత పరిమితం అవుతుంది. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయి, ప్రజల విశ్వాసం బలహీనపడుతుంది. తమిళనాడు, భారతదేశ సినిమా ప్రియులు కళలకు అభిరుచి, వివేచన, పరిణితిని తీసుకువస్తారు. వారు గౌరవానికి అర్హులు’’ అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
అందరూ ఏకమై
‘‘ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే.. సర్టిఫికేషన్ ప్రక్రియలపై సూత్రప్రాయమైన పునఃపరిశీలన, సర్టిఫికేషన్ కోసం నిర్దిష్ట కాలపరిమితులు, పారదర్శక మూల్యాంకనం. సూచించిన కట్ లేదా ఎడిట్కు రాతపూర్వక, హేతుబద్ధమైన సమర్థన. ఇప్పుడు సినీ పరిశ్రమ ఏకమై ఈ పద్ధతిపై చర్చించాలి" అని కమల్ హాసన్ పోస్టు చేశారు.
జన నాయగన్
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా జన నాయగన్. నిజానికి ఇది జనవరి 9న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో మూవీ మేకర్స్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. సింగిల్ డివిజన్ బెంచ్ జనవరి 9న తీర్పునిచ్చింది. జన నాయగన్ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ సెన్సార్ బోర్డు ఈ తీర్పును అప్పీల్ చేయడంతో మళ్లీ పై స్టే పడింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


