సెకండ్ ఇన్నింగ్స్ నా డిక్షనరీలో లేదు.. ధర్మంగా బ్రతకండి, అన్యాయానికి తలవంచకండి.. నందమూరి బాలకృష్ణ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా అఖండ 2. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ది తాండవం సాంగ్ను గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో బాలకృష్ణ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ అవేయిటెడ్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలకృష్ణ కుమార్తె
బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్-ది తాండవం ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా నిన్న (నవంబర్ 14) ముంబైలోని జుహూలోని పీవీఆర్ మాల్లో అఖండ 2 ది తాండవం సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా నిర్వహించి సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "మీడియా మిత్రులకు, నా అభిమానులకు ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ధన్యమైన జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ముందుగా ప్రణామాలు. వారి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను" అని అన్నారు.
"మా నాన్నగారి అడుగుజాడల్లో ముందుకు వెళుతున్నాను. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్గా ఎంతో మందికి ఉచిత వైద్యం అందించడం జరుగుతోంది. ఇంతమంది అభిమానుల్ని పొందడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను" అని బాలయ్య తెలిపారు.
నా డిక్షనరీలో లేదు
"50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నాను. సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు. హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమం అఖండ2లో సినిమాలో చూస్తారు. ధర్మంగా బ్రతకండి సత్యం మాట్లాడండి అన్యాయానికి తలవంచకండి.. ఇది అఖండ తాండవం" అని బాలకృష్ణ చెప్పారు.
"బోయపాటి గారితో మూడు సినిమాలు చేశాం. సింహ, లెజెండ్, అఖండ.. మూడు హ్యట్రిక్స్. ఇది నాలుగో సినిమా. బోయపాటి గారు నేను ఒకటే వేవ్ లెంత్లో వర్క్ చేస్తాం. తమన్తో అఖండ, వీర సింహారెడ్డి, నేలకొండ భగవంత కేసరి, డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ2. మాది అద్భుతమైన కాంబినేషన్" అని పేర్కొన్నారు బాలకృష్ణ.
"కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహదేవన్ గారు హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రతిఒక్కరు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమాని చూపించాలి. మన హిందూ సనాతన ధర్మం ఏమిటో చెప్పాలి. బజరంగ్ భాయిజాన్ తర్వాత హర్షాలి ఈ సినిమా చేసింది. ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర" అని బాలయ్య బాబు చెప్పారు.
ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్
"ఆది పినిశెట్టి అద్భుతమైన నటుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆచంట రామ్ గారు, గోపి గారి నిర్మాణంలో నాకు ఇది రెండో సినిమా. చాలా మంచి సినిమాలు తీయాలి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని తపనతో ఉండే ప్రొడ్యూసర్స్" అని బాలకృష్ణ వెల్లడించారు.
"జార్జియా, మధ్యప్రదేశ్ ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్లో షూట్ చేసిన సినిమా ఇది. సినిమాని ప్రజెంట్ చేస్తున్న నందమూరి తేజస్విని మా అమ్మాయి. నేను హోస్టుగా చేసిన అన్స్టాపబుల్ ఇండియాలో నెంబర్ వన్ షో. ఆ షోకి మా అమ్మాయి క్రియేటివ్ కన్సల్టెంట్గా వర్క్ చేశారు" అని బాలయ్య తెలిపారు.
"అఖండ2 చాలా అద్భుతమైన సినిమా. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది. ముంబై ఈవెంట్లో ఈ సాంగ్ని లాంచ్ చేయడం ఇక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్యూ. జైహింద్.. జై భారత్.. జై హైందవ సనాతన ధర్మం" అని నందమూరి బాలకృష్ణ తన స్పీచ్ ముగించారు.













