చిన్నప్పటి నుంచి అతని డ్యాన్సులంటే క్రేజ్, ఇండస్ట్రీలో అతనే మొదటి ఫ్రెండ్:స్టార్ హీరోపై రాజా సాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్
మలయాళ బ్యూటిపుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమా ది రాజా సాబ్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గ్లామర్ షోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది మాళవిక. అయితే, ఇండస్ట్రీలో మొదటి ఫ్రెండ్ అని స్టార్ హీరోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మాళవిక మోహనన్.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ల మధ్య స్నేహం ఉండటం సహజమే. కానీ, చిన్ననాటి నుంచే ప్రాణ మిత్రులుగా ఉండటం చాలా అరుదు. అలాంటి ఒక స్వచ్ఛమైన స్నేహం గురించి మలయాళ భామ మాళవిక మోహనన్ ముచ్చటించారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయిన మాళవిక మోహనన్ ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ కుమారుడైన విక్కీ కౌశల్తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియా పాడ్కాస్ట్లో స్టార్ హీరోపై మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అతనే నా ఫస్ట్ ఫ్రెండ్!
"విక్కీ కౌశల్ నా పాత స్నేహితుడు మాత్రమే కాదు, నా జీవితంలో, ఇండస్ట్రీలో మొదటి స్నేహితుడు కూడా" అని మాళవిక ఎంతో గర్వంగా చెప్పారు. ముంబైలో ఇరుగుపొరుగున పెరిగిన వీరు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఆడుకునేవారని తెలిపింది మాళవిక.
"నేను ఏడాది పాపగా ఉన్నప్పటి నుంచి నాకు విక్కీ తెలుసు. అప్పట్లో విక్కీకి ఆరేడు ఏళ్లు ఉంటాయేమో. మేము ఇప్పటికీ కలుస్తూనే ఉంటాం. మా అమ్మ చేసే మలయాళీ వంటలంటే విక్కీకి చాలా ఇష్టం. ఆ భోజనం తింటూ కబుర్లు చెప్పుకుంటాం తప్ప, మేము ఎప్పుడూ కెరీర్ గురించి చర్చించుకోము" అని మాళవిక మోహనన్ వివరించారు.
చిన్నప్పుడే డాన్సింగ్ స్టార్..
విక్కీ కౌశల్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని ఎప్పుడైనా ఊహించారా? అని అడిగిన ప్రశ్నకు మాళవిక నవ్వుతూ బదులిచ్చారు. "చిన్నప్పుడు ఎవరూ అలా ఆలోచించరు. కానీ ఆయన అప్పట్లోనే చాలా గొప్పగా డాన్స్ చేసేవారు. పుట్టినరోజు వేడుకల్లో 'పాసింగ్ ద పార్శిల్' ఆడుతున్నప్పుడు.. విక్కీ వంతు వస్తే చాలు తన డాన్స్తో అందరినీ కట్టిపడేసేవారు. ఆయన డాన్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. అతని డ్యాన్సులు క్రేజీగా అనిపించేది" అని గుర్తు చేసుకుంది మాళవిక.
వృత్తిపరంగా ఇద్దరూ బిజీ..
ఇదిలా ఉంటే, విక్కీ కౌశల్ కెరీర్ ప్రస్తుతం పీక్స్లో ఉంది. 2024లో 'బ్యాడ్ న్యూస్'తో అలరించిన ఆయన, 2025లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం 'ఛావా' (Chhaava) తో బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 807 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి 2025లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది.
స్టార్ హీరోగా మారిన విక్కీ కౌశల్ బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక విక్కీ కౌశల్ భార్య స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అని తెలిసిన విషయమే.
ప్రభాస్ సినిమాతో ఎంట్రీ
మరోవైపు మాళవిక మోహనన్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ప్రభాస్ చిత్రం 'ది రాజా సాబ్'తో మాళవిక మోహనన్ తెలుగులో అరంగేట్రం చేశారు. ప్రభాస్ హారర్ కామెడీ ది రాజా సాబ్లో గ్లామర్ షోతో మాళవిక కట్టిపడేసింది.
అయితే, ది రాజా సాబ్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 169 కోట్లకు పైగా వసూళ్లు సాధించి జోరు చూపిస్తోంది. దీనితో పాటు హీరో కార్తీ సరసన 'సర్దార్ 2' లోనూ మాళవిక మోహనన్ యాక్ట్ చేస్తోంది.

E-Paper












