దేశభక్తి మన గుండె చప్పుడు, అలా అంటే అవమానించడమే.. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కామెంట్స్
2025లో బాలీవుడ్ను ఊపేస్తున్న ‘ఛావా’, ‘ధురంధర్’ చిత్రాల భారీ హిట్స్పై హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ రియాక్డ్ అయ్యాడు. దేశభక్తిని అలా చూడటం అనేది ఆ ఎమోషన్ను అవమానించడమేనని విక్కీ కౌశల్ అభిప్రాయపడ్డాడు. దేశభక్తి అనేది మన గుండె చప్పుడు అని అభివర్ణించాడు ఛావా హీరో విక్కీ కౌశల్.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది దేశభక్తి మంత్రం చాలా గట్టిగా పనిచేసింది. ఇలా అనడం దేశభక్తి ఎమోషన్ను అవమానించడమే అని హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ అభిప్రాయ పడ్డాడు. అయితే, 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి రెండు హిందీ చిత్రాలైన ‘ఛావా’ (Chhaava), ‘ధురంధర్’ (Dhurandhar) మధ్య చాలా పోలికలు ఉన్నాయి.

వీరుల త్యాగాలను
ఈ రెండు సినిమాలూ జాతీయవాదాన్ని ఇతివృత్తంగా తీసుకున్నవే. పాపులర్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాల్లో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సినీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.
ఫార్ములా అనడం అవమానమే
"దేశభక్తి అనేది బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్ ఆడేందుకు ఒక ‘ఫార్ములా’గా మారిందా?" అన్నదే ఆ చర్చ సారాంశం. అయితే, ‘ఛావా’ హీరో విక్కీ కౌశల్ ఈ వాదనను ఏమాత్రం అంగీకరించ లేదు. తాజాగా ఎన్డీటీవీ (NDTV)తో జరిగిన సంభాషణలో ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
"దేశభక్తిని ఒక ఫార్ములాగా చూడలేం. అలా అనడం ఆ గొప్ప భావోద్వేగాన్ని అవమానించడమే అవుతుంది. దేశభక్తి అనేది మనందరిలో ఉండే నిజం. దాన్ని మన సినిమాలు, సాహిత్యం, క్రీడల ద్వారా ఎప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంటాం" అని విక్కీ కౌశల్ పేర్కొన్నారు.
ఇదొక గొప్ప మార్గం
దేశంపై తమకున్న గర్వాన్ని చాటుకోవడానికి ఫిల్మ్ మేకర్స్కు ఇదొక గొప్ప మార్గమని విక్కీ కౌశల్ అన్నారు. "మన దేశంలోని వైవిధ్యం, వారసత్వం, సత్యం గురించి మేము గర్వంగా చెబుతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో భారతీయతను భయం లేకుండా రిప్రజెంట్ చేస్తున్న ఈ గొప్ప సమయంలో నేను కూడా ఒక చిన్న భాగం కావడం నాకు గర్వంగా ఉంది" అని విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం
ఇకపోతే లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఛావా సినిమా మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ధైర్యసాహసాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో శంభాజీగా విక్కీ కౌశల్, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా పోటాపోటీగా నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 807 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తోంది. రణ్వీర్ సింగ్ ఒక అండర్ కవర్ ఏజెంట్గా పాకిస్థాన్ టెర్రర్ నెట్వర్క్ను కూల్చే పాత్రలో మెప్పించారు.

E-Paper












