పోలీసులకు ది రాజా సాబ్ నిర్మాత ఫిర్యాదు.. హద్దులు దాటితే ఊరుకోం అంటూ సీరియస్ అయిన ఎస్‌కేఎన్

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి సినిమాను, నటీనటులను కించపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published on: Jan 24, 2026 11:35 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజా సాబ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది.

పోలీసులకు ది రాజా సాబ్ నిర్మాత ఫిర్యాదు.. హద్దులు దాటితే ఊరుకోం అంటూ సీరియస్ అయిన ఎస్‌కేఎన్
పోలీసులకు ది రాజా సాబ్ నిర్మాత ఫిర్యాదు.. హద్దులు దాటితే ఊరుకోం అంటూ సీరియస్ అయిన ఎస్‌కేఎన్

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

అయితే, సినిమా ఫలితం ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ది రాజా సాబ్‌పై జరుగుతున్న నెగెటివ్ క్యాంపెయిన్, ట్రోలింగ్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఎస్‌కేఎన్ (SKN), శుక్రవారం (జనవరి 23) నాడు హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తన పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ సృష్టించి, ది రాజా సాబ్ సినిమాను, అందులోని నటీనటులను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కోరారు.

"కొందరు వ్యక్తులు నా పేరుతో తప్పుడు పోస్ట్‌లు పెడుతూ ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నారు. సినిమాపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి వారిని ఉపేక్షించబోం. హద్దులు దాటితే ఊరుకోం. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి" అని ఎస్‌కేఎన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ముందే హెచ్చరించిన నిర్మాత

ది రాజా సాబ్ టీజర్ విడుదల సమయంలోనే ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఒక నిర్మాత ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయాలని చూశారని, కానీ ప్రభాస్ అలాంటి మాటలు నమ్మకుండా సినిమా పూర్తి చేశారని ఎస్‌కేఎన్ గుర్తు చేశారు. ది రాజా సాబ్ మూవీ రిలీజ్ తర్వాత ట్రోలర్స్ ప్రధానంగా ఎస్‌కేఎన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద పరిస్థితి

ఇదిలా ఉంటే, సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ది రాజా సాబ్ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది.

ది రాజా సాబ్ కథ

తప్పిపోయిన తన తాతయ్య కోసం వెతుకుతూ ఒక పాత బంగళాలోకి వెళ్లిన యువకుడికి అక్కడ ఎదురైన భయానక పరిస్థితుల నేపథ్యంలో ది రాజా సాబ్ అనే హారర్-కామెడీ డ్రామా సాగుతుంది.

సంక్రాంతి బరిలో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి భారీ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, ప్రభాస్ క్రేజ్ వల్ల వసూళ్లు నిలకడగానే ఉన్నాయి.