Summer Special Recipe : వేసవి వేడికి చెక్ పెట్టే ఆంధ్రా స్టైల్ ‘పచ్చి పులుసు’ - అమృతం లాంటి రుచి!

Summer Special Recipe Pachi Pulusu : ఎండకాలంలో కడుపుకు హాయినిచ్చే సంప్రదాయ ఆంధ్రా వంటకం 'పచ్చి పులుసు' తయారీ విధానాన్ని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ పంచుకున్నారు. తక్కువ మసాలాలతో, ఉడికించే అవసరం లేకుండా చేసే ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Published on: May 1, 2026, 13:58:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pachi Pulusu Recipe : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ…. మసాలాలు, నూనెతో కూడిన భోజనం తినాలంటేనే భయమేస్తుంది. ఇలాంటి సమయంలో మన బామ్మల కాలం నాటి ‘పచ్చి పులుసు’ గుర్తుకు రాక మానదు.

పచ్చి పులుసు
పచ్చి పులుసు

తక్కువ శ్రమతో, వంట గ్యాస్‌తో పెద్దగా పనిలేకుండా, చకచకా తయారయ్యే ఈ పులుసు రుచిలో మేటి.. ఆరోగ్యానికి సాటి. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ ఈ ఆంధ్రా స్పెషల్ ‘పచ్చి పులుసు’ రెసిపీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఉత్తరాది వారికి కూడా ఈ దక్షిణ భారత అద్భుత రుచిని పరిచయం చేస్తూ ఆయన చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు వైరల్ అవుతోంది.

పచ్చి పులుసు… సంప్రదాయ పోషకాహారం

పచ్చి పులుసు అంటే కేవలం చారు మాత్రమే కాదు, అది తెలుగు వారి భావోద్వేగం. ఇందులో చింతపండు పులుపు, బెల్లం తీపి, పచ్చిమిర్చి కారం.. అన్నీ సమపాళ్లలో కలిసి నాల్కకు రుచిని, కడుపుకు చల్లదనాన్ని ఇస్తాయి. "వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవాలనుకునే వారికి పచ్చి పులుసు ఒక అద్భుతమైన ఎంపిక," అని చెఫ్ కునాల్ కపూర్ వివరించారు. ఈ వంటకంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, చింతపండు రసాన్ని మరిగించరు. అందుకే దీనిని 'పచ్చి' పులుసు అని పిలుస్తారు.

కావాలసిన పదార్థాలు:

  • చింతపండు - ఒక నిమ్మకాయ పరిమాణంలో
  • నీళ్లు - 3 కప్పులు
  • పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
  • ఉల్లిపాయ - 1 (సన్నని ముక్కలు)
  • ఉప్పు - రుచికి తగినంత
  • బెల్లం తురుము - ఒక టేబుల్ స్పూన్
  • కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
  • తాలింపు కోసం: నూనె (1 టీస్పూన్), ఎండుమిర్చి (1), జీలకర్ర (1 టీస్పూన్), ఆవాలు (అర టీస్పూన్).

పచ్చి పులుసు తయారీ విధానం…

మొదటగా చింతపండును శుభ్రం చేసి సుమారు గంటన్నర పాటు నీటిలో నానబెట్టాలి. అది బాగా నానిన తర్వాత చేతితో పిసికి రసం తీయాలి. ఈ రసమే పచ్చి పులుసుకు ప్రధాన ఆధారం. ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు తీసుకోవాలి. వీటిని చేతితో గట్టిగా నలపాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ, పచ్చిమిర్చిలోని ఘాటు, కొత్తిమీర సువాసన పులుసుకు బాగా పడతాయి.

ఆ తర్వాత…. సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో కలపాలి. పులుపును బట్టి మరికొన్ని నీళ్లను చేర్చుకోవచ్చు. చివరిగా బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఇక ముగింపుగా.. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని, ఆ పోపును పులుసులో వేయాలి. అంతే… ఎంతో రుచికరమైన ఆంధ్రా శైలి పచ్చి పులుసు సిద్ధం!

ఆరోగ్య ప్రయోజనాలు:

  • ఈ పచ్చి పులుసు కేవలం రుచికరమే కాదు, వేసవి కాలంలో శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది.
  • ఇందులో వాడే చింతపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
  • ఉల్లిపాయలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.
  • తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలు వాడటం వల్ల ఇది జీర్ణం కావడానికి చాలా తేలికగా ఉంటుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More