Hearing damage : హెడ్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త- ఈ '60/60' రూల్ పాటించండి..

How to prevent hearing damage : సంగీతం వినడం, పాడ్‌కాస్ట్‌లు చూడటం నేటి జీవనశైలిలో భాగమైపోయింది. అయితే, గంటల తరబడి హెడ్‌ఫోన్స్ వాడటం వల్ల శాశ్వతంగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ చెవులను కాపాడుకోవడానికి వైద్యులు సూచిస్తున్న ఆ నియమాలు ఇవే..

Published on: Apr 21, 2026 12:18 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Headphone hearing damage : ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీసులో పని చేస్తున్నా చాలా మందికి చెవుల్లో ఇయర్‌ఫోన్స్ ఉండాల్సిందే! కానీ, ఈ అలవాటు మెల్లమెల్లగా మీ వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఈ నేపథ్యంలో దిల్లీలోని 'రోగ నిదాన్ ఈఎన్‌టీ అండ్ డెంటల్ క్లినిక్' నిపుణులు డాక్టర్ ప్రాన్షు మెహతా, హెడ్‌ఫోన్స్ వాడే వారు పాటించాల్సిన కీలక జాగ్రత్తలను పంచుకున్నారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మాటిమాటికి హెడ్​ఫోన్స్​ వాడుతున్నారా?
మాటిమాటికి హెడ్​ఫోన్స్​ వాడుతున్నారా?

వినికిడిని కాపాడే '60/60' రూల్ అంటే ఏంటి?

హెడ్‌ఫోన్స్ వాడేటప్పుడు చెవులపై ఒత్తిడి తగ్గించడానికి డాక్టర్ మెహతా '60/60 నియమాన్ని' సూచించారు. దీని ప్రకారం:

మీ పరికరం (మొబైల్ లేదా ల్యాప్‌టాప్) గరిష్ట వాల్యూమ్‌లో 60 శాతం కంటే ఎక్కువ శబ్దాన్ని పెంచకూడదు.

రోజుకు హెడ్‌ఫోన్స్ వాడే సమయాన్ని కేవలం 60 నిమిషాలకు మాత్రమే పరిమితం చేయాలి.

ఈ నియమాన్ని పాటించడం వల్ల లోపలి చెవిలోని సున్నితమైన భాగాలపై ఒత్తిడి తగ్గుతుంది. శబ్దం వల్ల కలిగే నష్టం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇయర్‌బడ్స్ కంటే హెడ్‌ఫోన్స్ మేలు!

చాలా మంది చిన్నగా ఉండే ఇయర్‌బడ్స్‌ను ఇష్టపడతారు. కానీ, ఇవి శబ్దాన్ని నేరుగా కర్ణభేరి (ఇయర్ కెనాల్) వైపు పంపిస్తాయి. దీనికి బదులుగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ (ఓవర్​ ఇయర్ మోడల్స్) వాడటం మంచిదని డాక్టర్ సూచించారు. ఇవి శబ్దాన్ని సమానంగా పంపిణీ చేస్తాయి, తద్వారా వినికిడి అలసట తగ్గుతుంది.

హెచ్చరిక: 15 నిమిషాల్లోనే ప్రమాదం!

సాధారణంగా మనం వాడే హెడ్‌ఫోన్స్ 85 నుంచి 110 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.

85 జీబీ వద్ద రోజుకు 8 గంటల కంటే ఎక్కువ వినడం ప్రమాదకరం.

అదే శబ్దం 100 డీబీకి చేరితే, కేవలం 15 నిమిషాల్లోనే మీ చెవిలోని సున్నితమైన 'కోక్లియర్ హెయిర్ సెల్స్' దెబ్బతింటాయి. గుర్తుంచుకోండి, ఈ కణాలు ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ తిరిగి రావు. ఫలితంగా శాశ్వత చెవుడు వచ్చే అవకాశం ఉంది.

వినికిడి లోపం కలిగే ముందు కనిపించే సంకేతాలు..

మీరు ఈ కింది లక్షణాలను గమనిస్తే వెంటనే జాగ్రత్త పడాలి:

మునుపటి కంటే ఎక్కువ వాల్యూమ్ పెంచితేనే శబ్దం వినిపించడం.

చెవుల్లో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం.

చెవుల్లో నిరంతరం రింగుమనే శబ్దం రావడం.

హెడ్‌ఫోన్స్ తీసేసిన తర్వాత కూడా శబ్దం స్పష్టంగా లేనట్లు అనిపించడం.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఫోన్‌లో వాల్యూమ్ లిమిటర్ వాడటం వల్ల లాభం ఏంటి?

చాలా స్మార్ట్‌ఫోన్లలో వాల్యూమ్ లిమిటర్ ఫీచర్ ఉంటుంది. ఇది మీరు తెలియకుండానే శబ్దాన్ని ప్రమాదకర స్థాయికి పెంచకుండా అడ్డుకుంటుంది, తద్వారా మీ చెవులకు రక్షణ లభిస్తుంది.

2. రెగ్యులర్ ఆడియోగ్రామ్ పరీక్ష ఎందుకు చేయించుకోవాలి?

ఆడియోగ్రామ్ అనేది మీ వినికిడి సామర్థ్యాన్ని కొలిచే ఒక సాధారణ పరీక్ష. దీనివల్ల వినికిడి లోపం ప్రారంభ దశలోనే ఉందో లేదో గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

3. ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల వినికిడి శక్తి శాశ్వతంగా పోతుందా?

అవును. నిరంతరం అధిక శబ్దంతో ఇయర్‌ఫోన్స్ వాడితే లోపలి చెవిలోని కణాలు నశిస్తాయి. ఇవి మళ్లీ పుట్టవు కాబట్టి శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More