PM Modi fitness : అత్యంత బిజీ షెడ్యూల్లోనూ ఫిట్! ప్రధాని మోదీకి ఇది ఎలా సాధ్యం?
PM Modi : అత్యంత బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కఠినమైన ఫిట్నెస్ దినచర్యను పాటిస్తున్నారు. రోజూ యోగా, పంచతత్వ ట్రాక్పై నడక, కేవలం 3.5 గంటల నిద్ర, చాతుర్మాస దీక్షల వెనుక ఉన్న ఆసక్తికరమైన ఆరోగ్య రహస్యాలు ఇక్కడ తెలుసుకోండి..
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఫిట్నెస్ విషయంలో క్రమశిక్షణ, నిలకడ ఎంత ముఖ్యమో ప్రధాని నరేంద్ర మోదీ తరచూ నిరూపిస్తూనే ఉంటారు. సాధారణ వ్యాయామాలకు అతీతంగా ఆయన యోగా, నడక, ప్రాణాయామం, ధ్యానాన్ని తన దినచర్యలో భాగం చేసుకున్నారు. ఉదయం లేచిన మొదలు ఆహారపు అలవాట్లు, ఉపవాసాల వరకు ప్రధాని మోదీ అనుసరించే ఆరోగ్య రహస్యాలు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

యోగా, వాకింగ్, పంచతత్వ ట్రాక్..
మోదీ ఫిట్నెస్ రొటీన్లో యోగా ఎప్పుడూ ప్రధాన భాగమే. విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్నెస్ సవాల్ను స్వీకరించిన తర్వాత, 2018లో మోదీ తన ఉదయం వ్యాయామాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
“యోగాతో పాటు ప్రకృతిలోని ఐదు మూలకాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఆధారంగా రూపొందించిన పంచతత్వ ట్రాక్పై నేను నడుస్తాను. ఇది ఎంతో ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. అలాగే నేను శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా చేస్తాను,” అని మోదీ తన అధికారిక వెబ్సైట్లో తెలిపారు.
గడ్డి, రాళ్లు, నీరు వంటి వివిధ ఉపరితలాలపై మోదీ నడుస్తూ, స్ట్రెచింగ్, ధ్యానం చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. శారీరక చురుకుదనంతో పాటు మానసిక ప్రశాంతతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇది చెబుతోంది.
ఉపవాసంపై మోదీ మాటలు..
పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో జరిగిన 2025 నాటి ఇంటర్వ్యూలో మోదీ తన ఉపవాస పద్ధతుల గురించి మరింత లోతుగా వివరించారు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానివేయడం మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు.
“ఉపవాసం అనేది కేవలం భోజనం మానేయడం మాత్రమే కాదు, అది దానికంటే మించిన ఒక గొప్ప శాస్త్రం అని నేను గట్టిగా నమ్ముతాను,” అని మోదీ ఆ పాడ్కాస్ట్ సమయంలో అన్నారు. ఉపవాసం అనేది తనకు చాలా కాలంగా ఉన్న క్రమశిక్షణ అని ఆయన పేర్కొన్నారు.
“ఉపవాసం ఎప్పుడూ నా పని వేగాన్ని తగ్గించదు. నేను ఎప్పట్లాగే పని చేస్తాను. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే చేస్తాను,” అని మోదీ వివరించారు. ఉపవాసం తనకు ఒక ఆధ్యాత్మిక, వ్యక్తిగత క్రమశిక్షణ అని, ఇది తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి సహాయపడుతుందని చెప్పారు. “నాకు ఉపవాసం అంటే భక్తి, నాకు ఉపవాసం అంటే ఆత్మనిగ్రహం,” అని ఆయన ఆ సంభాషణలో తెలిపారు.
పురాతన భారతీయ సంప్రదాయమైన 'చాతుర్మాసం' తన ఆహారపు అలవాట్లను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా మోదీ వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమై నవంబర్లో దీపావళి వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు. సుమారు నాలుగున్నర నెలల పాటు ఆయన 24 గంటల్లో కేవలం ఒకే ఒకసారి భోజనం చేస్తారు. వర్షాకాలంలో పాటించే చాతుర్మాస దీక్ష సంప్రదాయం ప్రకారం తాను గత 50 నుంచి 55 ఏళ్లుగా ఈ ఉపవాసాలను పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కఠినమైన షెడ్యూల్, ఫిట్నెస్ క్రమశిక్షణ..
ప్రధాని మోదీ పని పట్ల చూపించే అంకితభావం గురించి ఆయనతో ఎప్పుడూ టచ్లో ఉండే వారు తరచూ చర్చిస్తుంటారు. ఫిబ్రవరిలో ఎంపీలతో జరిగిన 45 నిమిషాల సమావేశంలో మోదీ తన రోజువారీ దినచర్య, వ్యాయామం, విదేశీ ప్రయాణాల గురించి పంచుకున్నట్లు కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తెలిపారు.
మురుగన్ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ రోజుకు కేవలం 3.5 గంటలు మాత్రమే నిద్రపోతారని, సాయంత్రం 6 గంటల తర్వాత ఏమీ తినరని చెప్పారు.
“అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయారు, సంతోషించారు. ప్రధాని మోదీ తన రోజువారీ దినచర్య గురించి, వ్యాయామం గురించి, విదేశీ పర్యటనల గురించి పంచుకున్నారు. ఆయనతో గడిపిన ఆ 45 నిమిషాల్లో ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలు నేర్చుకున్నాం. ఆయన రాత్రిపూట 3.5 గంటలు మాత్రమే నిద్రపోతానని, సాయంత్రం 6 తర్వాత భోజనం చేయనని చెప్పారు,” అని మురుగన్ పేర్కొన్నారు.
'నరేంద్ర మోదీ: ది గేమ్ఛేంజర్' పుస్తక రచయిత సుధేష్ వర్మ కూడా మోదీ ఫిట్నెస్ అలవాట్ల గురించి రాశారు. వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచే ఉదయం పూట నడకతో దినచర్యను ప్రారంభించేవారని, ఇప్పటికీ ఆ అలవాటును అలాగే కొనసాగిస్తున్నారని తెలిపారు. నడకతో పాటు యోగా, సూర్య నమస్కారాలు, ధ్యానంపై మోదీ ప్రత్యేక దృష్టి పెడతారని వివరించారు.
ఈ విషయాలన్నీ కలిపి చూస్తే.. ప్రధాని మోదీ తన అత్యంత బిజీ షెడ్యూల్లోనూ ఫిట్నెస్ను, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏ విధంగా భాగం చేసుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


