ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మీరు ఈ ప్పు చేస్తున్నారా? హైదరాబాద్ వైద్యుడి గోల్డెన్ రూల్

బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు తరచుగా చేసే పొరపాట్లపై హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నిపుణులు డాక్టర్ సుధీర్ కుమార్ కీలక విశ్లేషణ చేశారు. ఉదయం టిఫిన్ మానేయడం కంటే రాత్రి భోజనం త్వరగా ముగించడమే మేలని ఆయన వివరించారు.

Published on: Feb 17, 2026 7:24 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బరువు తగ్గాలని ఆశపడే వారికి ప్రస్తుతం 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' (Intermittent Fasting) ఒక ట్రెండ్‌గా మారింది. నిర్ణీత సమయం మాత్రమే ఆహారం తీసుకుంటూ, మిగిలిన గంటలన్నీ ఉపవాసం ఉండటం ఈ పద్ధతి ప్రత్యేకత. సాధారణంగా చాలామంది 16 గంటల ఉపవాసం, 8 గంటల భోజన సమయం (16:8) పాటిస్తుంటారు. అయితే, ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం కంటే, ఏ సమయంలో తీసుకుంటున్నామనేది అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, మీరు పొరపాటున బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మీరు ఈ ప్పు చేస్తున్నారా? హైదరాబాద్ వైద్యుడి గోల్డెన్ రూల్ (Shutterstock)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మీరు ఈ ప్పు చేస్తున్నారా? హైదరాబాద్ వైద్యుడి గోల్డెన్ రూల్ (Shutterstock)

మీరు చేస్తున్న ఫాస్టింగ్ సరైనదేనా?

హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విషయంలో ప్రజలు చేస్తున్న ఒక ప్రధాన పొరపాటును ఎత్తిచూపారు. "చాలామంది ఉదయం అల్పాహారం మానేసి, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన శరీర జీవక్రియలకు (Biology) వ్యతిరేకంగా పోరాడుతున్నట్టే" అని ఆయన హెచ్చరించారు.

కేవలం ఎన్ని గంటలు ఉపవాసం ఉన్నామనేది మాత్రమే కాదు, ఏ సమయంలో తింటున్నామనేది కూడా అంతే ముఖ్యమని 2025 నవంబర్‌లో వచ్చిన 'BMJ మెడిసిన్' పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

1. మన శరీరానికి ఒక గడియారం ఉంటుంది

మన శరీరం పగటిపూట పోషకాలను గ్రహించడానికి, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి అలవాటు పడి ఉంటుంది. "పగటిపూట ఇన్సులిన్ పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. రాత్రి అయ్యేకొద్దీ అది తగ్గుతుంది. శరీరం తనను తాను మరమ్మత్తు (Repair mode) చేసుకునే సమయంలో మనం ఆహారం తీసుకుంటే, అది జీర్ణం కావడం కష్టమవుతుంది" అని డాక్టర్ సుధీర్ వివరించారు.

2. రాత్రి భోజనం కంటే అల్పాహారమే మిన్న

ఉదయం 8 లేదా 10 గంటలకే ఆహారం తీసుకోవడం ప్రారంభించే 'ఎర్లీ టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్' (eTRE) పద్ధతి అత్యంత ప్రభావవంతమైనదని అధ్యయనాలు చెబుతున్నాయి.

"ఉదయాన్నే భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి, రక్తపోటు తగ్గుతుంది. ఆలస్యంగా తినే వారితో పోలిస్తే వీరు ఆరోగ్యంగా ఉంటున్నారు" అని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు.

3. మెలటోనిన్ ప్రభావం

చీకటి పడగానే మన మెదడులో 'మెలటోనిన్' అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించమని ప్యాంక్రియాస్‌కు సూచిస్తుంది. ఒకవేళ మీరు రాత్రి 9 గంటలకు భారీ భోజనం చేస్తే, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాక రక్తంలో చక్కెర స్థాయిలు చాలా సేపటి వరకు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

4. రాత్రి భోజనం మానేస్తేనే లాభం

బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కంటే రాత్రి భోజనాన్ని మానేయడం లేదా చాలా త్వరగా ముగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని డాక్టర్ సుధీర్ సూచించారు. సాయంత్రం 4 లేదా 6 గంటలకే భోజనం ముగించడం వల్ల, నిద్రపోయే సమయంలో శరీరం కణాల శుద్ధీకరణ ప్రక్రియను చేపడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలోనూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సరిగ్గా పాటించాలంటే సూర్యుడి గమనాన్ని అనుసరించాలని డాక్టర్ సుధీర్ సూచిస్తున్నారు.

"ఉదయం రాజులా (భారీగా), మధ్యాహ్నం యువరాజులా (మితంగా), రాత్రిపూట పేదవాడిలా (చాలా తక్కువగా లేదా అసలు ఏమీ తినకుండా) ఉండాలి. గడియారాన్ని చూడటం ఆపి, శరీర తత్వానికి తగ్గట్టుగా మారండి" అని ఆయన హితవు పలికారు.

(గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా డైట్ పద్ధతిని ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్ లేదా నిపుణుల సలహా తీసుకోవాలి.)