విద్యార్థులకు షాక్- ఐటీ కంపెనీల 2026 క్యాంపస్ ప్లేస్మెంట్స్ భారీగా డౌన్..!
ఆటోమేషన్ పెరుగుదల, అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి! టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు గతేడాది కంటే ఈసారి (2026 బ్యాచ్) క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తక్కువగా నియమించుకునే అవకాశం ఉంది!
దేశీయ సాఫ్ట్వేర్ సేవల సంస్థలు సహా పెద్ద కంపెనీల్లో ఐటీకి సంబంధించిన ఉద్యోగాల కోసం చూస్తున్న దేశంలోని 13 లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఈసారి భారీ షాక్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది! దిగ్గజ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ని తగ్గించేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఆటోమేషన్ పెరుగుదల, మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు!
దేశంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీలకు చెందిన కనీసం ఐదుగురు ప్లేస్మెంట్ హెడ్స్ అభిప్రాయం ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి ఐటీ సేవల సంస్థలు, అలాగే పెద్ద బహుళజాతి కంపెనీల (ఎంఎన్సీలు) బ్యాక్-ఎండ్ టెక్ సెంటర్లు గతేడాదితో పోలిస్తే.. 2026 బ్యాచ్ విద్యార్థులను తక్కువ సంఖ్యలో నియమించుకునే అవకాశం ఉంది!
క్యాంపస్ల నుంచి నియామకాలు తగ్గడం ఐటీ సేవల సంస్థలకు ఇది వరుసగా మూడవ సంవత్సరం. ఎందుకంటే, కంపెనీలు ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ), క్లౌడ్, డేటా అనలిటిక్స్లో ప్రత్యేకీకరించిన నైపుణ్యాలు ఉన్న ప్రతిభావంతులపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల మధ్య పోటీ మరింత పెరిగింది. ఐటీ కంపెనీలో ఉద్యోగానికి ప్రధాన మార్గంగా భావించే కోడింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్ నైపుణ్యంతో పాటు అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆటోమేషన్, మల్టిపుల్ వెండార్లే కారణం
నియామకాల తగ్గుదలకు ప్రధాన కారణం ఆటోమేషన్ అని, అలాగే అనేక ఐటీ వెండార్లను ఎంగేజ్ చేసుకోవడం వల్ల ప్రాజెక్ట్ల కోసం పెద్ద మొత్తంలో గ్రాడ్యుయేట్లను నియమించుకోవాల్సిన అవసరం ఐటీ సంస్థలకు తగ్గింది అని ఓ ప్లేస్మెంట్ అధికారి తెలిపారు.
బెంగళూరుకు చెందిన రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ డీన్, శ్రీనివాస రామానుజం కందురి మాట్లాడుతూ, “ఏఐ కారణంగా డిమాండ్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఐటీ పనుల కోసం కంపెనీలు మల్టిపుల్ వెండార్స్ను ఎంచుకోవడంతో ప్రాజెక్ట్ అవసరాలు తగ్గాయి. ఉద్యోగులను నియమించుకుని, వారికి పని లేకుండా ఖాళీగా ఉంచే బదులు, ప్రస్తుతం నియామకాలను నిలిపివేశారు,” అని వివరించారు.
“దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థలు రెండేళ్ల క్రితం మూడంకెల సంఖ్యలో విద్యార్థులను నియమించుకునేవి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య రెండంకెలకు, అంటే 50-70 విద్యార్థులకు తగ్గింది,” అని కందురి చెప్పారు.
రామయ్య ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే 2026 బ్యాచ్ విద్యార్థుల్లో దాదాపు ముప్పావు వంతు మందికి ప్లేస్మెంట్స్ పూర్తయ్యాయి. వీరు ప్రధానంగా సాఫ్ట్వేర్, ఏఐ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు పొందారు. మిగిలిన విద్యార్థుల ప్లేస్మెంట్స్ జనవరి నాటికి పూర్తవుతాయని కందురి ఆశిస్తున్నారు. గతేడాది ఈ కాలేజీ విద్యార్థులకు 358 కంపెనీల నుంచి 1,892 ఉద్యోగ ఆఫర్లు రాగా, సగటు వార్షిక జీతం రూ. 7.7 లక్షలుగా ఉంది.
అమెరికా మార్కెట్ అనిశ్చితి, ఏఐ ప్రభావం
మరో కాలేజీకి చెందిన ప్లేస్మెంట్ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తంజావూరులోని శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ కార్పొరేట్ రిలేషన్స్ అండ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ డీన్, డాక్టర్ బద్రీనాథ్ వి మాట్లాడుతూ.. “యూఎస్లో టారిఫ్ వార్స్, ఏఐ ప్రభావం, కోవిడ్ అనంతర పరిస్థితుల కారణంగా ఐటీ సేవల సంస్థలు ప్రతి ఒక్కటీ గతేడాది కంటే ఈసారి తక్కువ సంఖ్యలో నియామకాలు చేపట్టాలని చూస్తున్నాయి,” అని తెలిపారు.
స్వదేశీ ఐటీ సంస్థలకు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో టారిఫ్లకు సంబంధించిన అనిశ్చితులు, పెద్ద కంపెనీలను తమ టెక్ ఖర్చులను తగ్గించుకునేలా చేశాయి. దీని ఫలితంగా, ఐటీ సంబంధిత పనులకు డిమాండ్లో అనిశ్చితి ఉండడంతో, ఐటీ సేవల సంస్థలు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయి.
కాలేజీల్లోని ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్లు 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్కు ఐటీ సేవల సంస్థలు, జీసీసీ (గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్)ల నుంచి వచ్చిన ప్లేస్మెంట్ల సంఖ్య గురించి మాట్లాడటానికి ఇష్టపడనప్పటికీ, గత కొన్ని సంవత్సరాలలో ఇదే అత్యల్ప ప్లేస్మెంట్ ఆఫర్ల ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
నియామక ప్రక్రియ ఆలస్యం
నియామకాలు ఆలస్యం కావడానికి ఆటోమేషన్ కూడా ఒక కారణం కావచ్చని నాల్గొవ ప్లేస్మెంట్ హెడ్ చెప్పారు.
“ఐటీ సేవల సంస్థలు, జీసీసీలు నియామకాలపై చర్చలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఈ ఏడాది నియామకాలు ఆలస్యం అయ్యాయి. సాధారణంగా, ఈ సమయానికి నియామకాలు పూర్తయ్యేవి. కానీ, తమకు అవసరమైన ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత కాస్త ఆలస్యంగా రావడంతో నియామకాలు వాయిదా పడ్డాయి. అయితే, వారు తప్పకుండా నియమించుకుంటారని మాకు చెప్పారు,” అని బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్లేస్మెంట్ హెడ్, డాక్టర్ కె.ఎస్. శ్రీధర్ తెలిపారు.
విద్యార్థుల్లో అనిశ్చితి
కంపెనీల వ్యాఖ్యల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 42,000, ఇన్ఫోసిస్ 20,000, విప్రో లిమిటెడ్ 12,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. మరోవైపు, హెచ్సీఎల్ టెక్ ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే విభాగాల్లో 7,800 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.
'బిగ్ ఫైవ్' కంపెనీలు ఏప్రిల్-సెప్టెంబర్ 2025 కాలంలో మొత్తం 3,097 మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకున్నాయి. ఇది గతేడాది మొత్తం నియామకాలలో దాదాపు మూడింట ఒక వంతు. అదే సమయంలో, 1 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న దేశంలోని మధ్యస్థాయి ఐటీ సేవల సంస్థలు 7,802 మంది ఉద్యోగులతో ఈ కాలాన్ని ముగించాయి. ఇది గతేడాది సంఖ్యలో దాదాపు సగం.
సాధారణంగా రూ. 4 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు జీతభత్యాలు ఉండే ఉద్యోగాల కోసం ఎంపికయ్యే కాలేజీ గ్రాడ్యుయేట్ల భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది.
భవిష్యత్తుపై నిపుణుల అభిప్రాయం
"గత 30 ఏళ్లలో ఐటీ సేవలు సరళమైన పద్ధతిలో వృద్ధి చెందాయి. ఎక్కువ మంది వ్యక్తులు, ఎక్కువ ప్రాజెక్టులు క్రమంగా వృద్ధిని నడిపాయి. కానీ ఏఐ సమయం, ఖర్చు, సంక్లిష్టతను తగ్గిస్తూ, విలువను సృష్టించే విధానాన్ని పునర్నిర్వచిస్తోంది," అని కాగ్నిజెంట్ సీఈఓ ఎస్. రవి కుమార్ అక్టోబర్ 29న తమ పోస్ట్-ఎర్నింగ్స్ కాల్లో పేర్కొన్నారు.
సాంప్రదాయకంగా పెద్ద సంఖ్యలో నియామకాలు చేపట్టే ఐటీ సేవల సంస్థలు ఈ ఏడాది ముఖ్యంగా టైర్-II, టైర్-III సంస్థలలో ఆఫర్లను తగ్గిస్తున్నాయి. అయితే, కన్సల్టింగ్ సంస్థలు మాత్రం 2026 బ్యాచ్ కోసం తమ బలమైన నియామక జోరును కొనసాగించే అవకాశం ఉంది.
సమర్ ప్లేస్మెంట్ల నుంచి వస్తున్న తొలి సంకేతాలు ఈ రిక్రూటర్ల నుంచి డిమాండ్ స్థిరంగా ఉందని సూచిస్తున్నాయి. అదే సమయంలో, ఇంజనీరింగ్, తయారీ, మౌలిక సదుపాయాలు వంటి కోర్ సెక్టార్లు, సెమీకండక్టర్లు, ఏఐ-ఆధారిత సంస్థల వంటి ఎమర్జింగ్ విభాగాలు ఈ లోటును పూడ్చడానికి ముందుకు వస్తున్నాయి.
ఒక బ్రోకరేజ్ సంస్థ జూనియర్ స్థాయి నియామకాలు తగ్గుతాయని అంచనా వేసినప్పటికీ, ప్రత్యేక నైపుణ్యం ఉన్న రోల్స్లో ఎక్కువ నియామకాలు ఉంటాయని భావించింది.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు అభిషేక్ బెనర్జీ, జయరామ్ శెట్టి నవంబర్ 13 నాటి నోట్లో, "జూనియర్ ఐటీ నియామకాలపై అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, ప్రీమియం ప్రతిభ, జీసీసీ రోల్స్, నాన్-ఐటీ పాత్రలకు డిమాండ్ బలంగా ఉంది," అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


