ఐటీ కొలువులపై ఏఐ పంజా.. ప్రధాని మోదీకి బెర్న్‌స్టెయిన్ లేఖ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం భారత మధ్యతరగతి వెన్నెముకగా ఉన్న ఐటీ, బీపీవో రంగాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ 'బెర్న్‌స్టెయిన్' సూచించింది. మన డేటాతో విదేశీ సంస్థలు బలపడుతుంటే, భారత్ కేవలం ఒక వినియోగదారుగా మిగిలిపోయే ముప్పు ఉందని పేర్కొంటూ ప్రధానికి బహిరంగ లేఖ రాసింది.

Published on: Apr 23, 2026, 17:02:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లాంటిది మధ్యతరగతి. ఆ మధ్యతరగతి కలలకు ఊపిరిపోస్తున్నది ఐటీ (IT), బీపీవో (BPO) రంగాలు. అయితే, ఇప్పుడు ఈ రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఈక్విటీ రీసెర్చ్ సంస్థ బెర్న్‌స్టెయిన్, ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన 12 పేజీల బహిరంగ లేఖలో సంచలన విషయాలను వెల్లడించింది. భారత్ తన వ్యూహాలను మార్చుకోకపోతే, భవిష్యత్తులో ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్, డ్రైవర్లే ఎక్కువగా తయారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్

మధ్యతరగతి ఆశలపై ఏఐ దెబ్బ?

ప్రస్తుతం భారత్‌లోని ఐటీ సర్వీసులు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బీపీవోల్లో సుమారు 1.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఏఐ రాకతో ఈ ఉద్యోగాల్లో సింహభాగం ఆటోమేషన్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆదాయ మార్గాల్లో తీవ్ర అస్థిరత ఏర్పడుతుందని బెర్న్‌స్టెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది.

"మన తదుపరి వృద్ధి కథనం మరింత మంది ఇంజనీర్లను, ఆవిష్కర్తలను సృష్టిస్తుందా? లేక కేవలం డ్రైవర్లను, డెలివరీ సిబ్బందిని, ఇంటి పనివారినే తయారుచేస్తుందా? అనేదే ఇప్పుడు భారత్ ముందున్న అతిపెద్ద ప్రశ్న" అని బెర్న్‌స్టెయిన్ తన లేఖలో సూటిగా ప్రశ్నించింది.

వినియోగదారులమేనా.. సృష్టికర్తలమా?

ప్రస్తుతం గ్లోబల్ ఏఐ మోడల్స్ అన్నీ భారతీయ డేటా ఆధారంగానే శిక్షణ పొందుతున్నాయి. కానీ, ఆ ఏఐ నుంచి వస్తున్న అసలైన సంపద, ఐపీ (Intellectual Property) మాత్రం అమెరికా, చైనా వంటి దేశాలకే పరిమితమవుతోంది. భారత్ కేవలం డేటా సెంటర్లకు 'హోస్ట్'గా మాత్రమే మారుతోంది తప్ప, సొంతంగా ఫ్రంటియర్ ఏఐ మోడల్స్‌ను రూపొందించడంలో వెనుకబడి ఉందని బెర్న్‌స్టెయిన్ విశ్లేషించింది. చివరకు హై-పెర్ఫార్మెన్స్ సర్వర్లు, ఏఐ చిప్స్ (GPUs) కోసం మనం ఇతర దేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

చైనా తరహా కఠిన వ్యూహం అవసరం

ఏఐ రంగంలో స్వయం సమృద్ధి (Self rel-AI-nce) సాధించాలంటే భారత్ రక్షణత్మాక ధోరణిని అవలంబించాలని బెర్న్‌స్టెయిన్ సూచించింది. ఇందుకోసం కొన్ని కీలక సంస్కరణలను ప్రతిపాదించింది:

  • భారత్‌లో సేవలు అందిస్తున్న గ్లోబల్ టెక్ కంపెనీలు తప్పనిసరిగా ఇక్కడే లిస్ట్ అవ్వాలి.
  • వాటి విలువలో సగం భారతీయ ప్రజలకు దక్కేలా చూడాలి.
  • డేటా లోకలైజేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసి, మన డేటాపై మనకే నియంత్రణ ఉండేలా చూడాలి.

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలపై ప్రభావం

తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ రంగంలో ఈ ఏఐ ముప్పు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కేవలం కోడింగ్, టెస్టింగ్‌తో సాగిపోయిన ఉద్యోగాలు ఇప్పుడు ఏఐ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా నిమిషాల్లో పూర్తవుతున్నాయి. కొత్తగా శ్రమశక్తిలోకి వస్తున్న యువతకు సరైన నైపుణ్యాలు లేకపోతే, వారు తక్కువ వేతనంతో కూడిన సేవా రంగాల్లోకి మళ్లాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం నుంచి బయటకు వస్తున్న మిగులు శ్రమశక్తికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారుతోంది.

రోబోటిక్స్, ఆటోమేషన్, ఏఐ ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను ముందే గుర్తించి, వాటిలో పెట్టుబడులు పెడితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కగలమని బెర్న్‌స్టెయిన్ నివేదిక స్పష్టం చేసింది. లేదంటే భారత్ శాశ్వతంగా ఏఐ ఆర్థిక వ్యవస్థలో కేవలం వినియోగదారు స్థాయికే పరిమితమవుతుందని హెచ్చరించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఏఐ వల్ల ఏయే రంగాల్లో ఉద్యోగాలకు ముప్పు ఉంటుంది?

ప్రధానంగా ఐటీ సర్వీసులు, బీపీవో (BPO), కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలోని సాధారణ స్థాయి ఉద్యోగాలకు ఆటోమేషన్ ముప్పు పొంచి ఉంది.

2. భారత్ కేవలం ఏఐ వినియోగదారుగానే ఎందుకు మిగిలిపోతుంది?

మనం సొంతంగా ఏఐ చిప్స్, సర్వర్లు లేదా మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేయకుండా కేవలం విదేశీ టెక్నాలజీని వాడుకుంటున్నాం. దీనివల్ల మన డేటా ఇతర దేశాల కంపెనీలను ధనవంతులను చేస్తోంది తప్ప, మనకు ఐపీ హక్కులు రావడం లేదు.

3. బెర్న్‌స్టెయిన్ మోదీ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రధాన సూచన ఏమిటి?

డేటా లోకలైజేషన్ చట్టాలు తేవాలని, విదేశీ టెక్ దిగ్గజాలు భారత్‌లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేలా చూడాలని, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు రంగాల్లో ఇప్పుడే భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More