IndiGo Cab Service: విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్.. రూ.49కే ఎయిర్పోర్ట్ క్యాబ్ సర్వీస్..
Cabs with indigo : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికుల కోసం 'క్యాబ్స్ విత్ ఇండిగో' పేరుతో సరికొత్త ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ సర్వీస్ను ప్రారంభించింది. కేవలం రూ.49 ప్రారంభ ధరతో, ఎలాంటి సర్జ్ ఛార్జీలు లేకుండా నమ్మకమైన క్యాబ్ సేవలను అందిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతదేశంలో విమాన ప్రయాణాన్ని సులభతరం చేసిన ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో ఇప్పుడు ప్రయాణికుల కోసం మరో అద్భుతమైన సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం విమాన సర్వీసులకే పరిమితం కాకుండా, ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు చేరుకోవడానికి అలాగే ఎయిర్పోర్ట్ నుంచి సురక్షితంగా ఇళ్లకు వెళ్లేందుకు ‘క్యాబ్స్ విత్ ఇండిగో’ పేరుతో కొత్త ఎయిర్పోర్ట్ క్యాబ్ సర్వీస్ను ప్రారంభించింది. జూన్ 18న అధికారికంగా ప్రకటించిన ఈ సేవలు.. ప్రస్తుతం ఇండిగో మొబైల్ యాప్, అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ప్రయాణికులు తమ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఎయిర్పోర్ట్ క్యాబ్ను కూడా ఒకే ప్లాట్ఫామ్పై బుక్ చేసుకోవచ్చు.

'క్యాబ్స్ విత్ ఇండిగో' ప్రత్యేకత ఏంటి?
ఎయిర్పోర్ట్కు వెళ్లేటప్పుడు లేదా వచ్చేటప్పుడు సాధారణంగా ప్రయాణికులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలు.. చివరి నిమిషంలో డ్రైవర్లు రైడ్ను క్యాన్సిల్ చేయడం, క్యాబ్లు సకాలంలో దొరకకపోవడం, పీక్ అవర్స్లో విపరీతంగా పెరిగిపోయే సర్జ్ ప్రైసింగ్ (అదనపు ఛార్జీలు). ఇటువంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఇండిగో ఈ సేవలను ప్రవేశపెట్టింది.
మోజోబాక్స్ భాగస్వామ్యంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవలను అందిస్తున్నారు. విమాన ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఈ సరికొత్త క్యాబ్ సర్వీస్లోని ముఖ్యమైన ఫీచర్లు ఇవే..
కేవలం రూ. 49 ల ప్రారంభ ధరతోనే క్యాబ్ బుకింగ్ సదుపాయం.
100% రైడ్ కన్ఫర్మేషన్, ఖచ్చితమైన పికప్ గ్యారెంటీ.
ముందే బుక్ చేసుకునే క్యాబ్ల కోసం పూర్తి పారదర్శకమైన ధరలు.
ఎలాంటి సర్జ్ ఫీజులు లేదా అదనపు ఛార్జీలు ఉండవు.
క్యాబ్ మీ వద్దకు వచ్చే సమయం వరకు ఎప్పుడైనా ఉచితంగా రైడ్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు.
విమానం లేట్ అయినా లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యమైనా.. 30 నిమిషాల పాటు ఉచిత వెయిటింగ్ సమయం ఉంటుంది.
ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎంతో సులభంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నమ్మకమైన రవాణా సౌకర్యాన్ని తీసుకువచ్చినట్లు ఇండిగో ప్రతినిధులు తెలిపారు.
ఇండిగో బ్లూచిప్ ద్వారా అదనపు ప్రయోజనాలు..
ఈ కొత్త క్యాబ్ సర్వీస్ను ఇండిగో తన లాయల్టీ ప్రోగ్రామ్ 'ఇండిగో బ్లూచిప్'తో అనుసంధానించింది. దీనివల్ల ఈ క్యాబ్ సర్వీస్ ద్వారా ప్రయాణికులు ఖర్చు చేసే ప్రతి రూ. 100పై 5 ఇండిగో బ్లూచిప్స్ పాయింట్లను రివార్డులుగా పొందవచ్చు. అంటే ప్రయాణికులు కేవలం విమానంలో ప్రయాణించేటప్పుడే కాకుండా, ఎయిర్పోర్ట్ క్యాబ్స్ వాడుకునేటప్పుడు కూడా రివార్డు పాయింట్లను సంపాదించుకోవచ్చు.
ఇండిగో సంస్థ కేవలం విమాన సర్వీసులకే పరిమితం కాకుండా ప్రయాణికులకు ఒకే చోట అన్ని రకాల ప్రయాణ సేవలను అందించే ప్లాట్ఫామ్గా ఎదుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 7 లక్షలకు పైగా హోటల్ రూమ్ బుకింగ్స్ ఆప్షన్లను, ప్రత్యేకమైన సైట్సీయింగ్ (టూర్స్) ప్యాకేజీలను అందిస్తోంది. ఇప్పుడు వీటికి ఎయిర్పోర్ట్ క్యాబ్ సర్వీస్ కూడా తోడవడంతో ఇండిగో ప్రయాణ ఇకోసిస్టమ్ మరింత బలంగా మారింది.
ఈ సరికొత్త సేవల వెనుక ఉన్న కంపెనీ విజన్ను ఇండిగో చీఫ్ డిజిటల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నీతన్ చోప్రా వివరించారు.
“ఇండిగోలో మా లక్ష్యం కేవలం విమానాలను నడపడం మాత్రమే కాదు. మా కస్టమర్లు పూర్తిగా నమ్మగలిగే ఒక సంపూర్ణమైన, అంతరాయం లేని ప్రయాణ వ్యవస్థను నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాము. 'క్యాబ్స్ విత్ ఇండిగో' రాకతో ఈ విజన్ మరింత బలపడింది. దీనివల్ల ప్రయాణికులు తమ ఇళ్ల నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎయిర్పోర్ట్కు చేరుకుని, ఆపై తమ గమ్యస్థానాన్ని చేరుకునే వరకు ప్రతి దశలోనూ ప్రయాణం ఎంతో సురక్షితంగా, నమ్మకంగా, ఒత్తిడి లేకుండా సాగుతుంది” అని నీతన్ చోప్రా పేర్కొన్నారు.
కస్టమర్లకు అర్థవంతమైన, ఇబ్బందులు లేని స్థిరమైన రవాణా సేవలను అందించాలనే తమ నిశ్చయానికి ఈ కొత్త సర్వీస్ ఒక నిదర్శనమని ఆయన అదనంగా పేర్కొన్నారు.
బుకింగ్ చేసుకోవడం ఎలా?
ప్రయాణికులు 'క్యాబ్స్ విత్ ఇండిగో' సేవలను నేరుగా ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా వారి మొబైల్ యాప్ ద్వారా చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్లు, టూర్ ప్యాకేజీలతో పాటు ఎయిర్పోర్ట్ క్యాబ్లను కూడా ఒకే యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మేనేజ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


