...
...
Next Story

Bank strike : నేడు బ్యాంకు సమ్మె- దేశవ్యాప్తంగా బ్యాంకింగ్​ సేవలకు తీవ్ర అంతరాయం..

వారానికి ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌ను సాధించుకునేందుకు బ్యాంకు యూనియన్లు జనవరి 27న సమ్మెకు పిలుపునిచ్చాయి. నాలుగో శనివారం, ఆదివారం, రిపబ్లిక్ డే సెలవులతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడి ఉండటం, ఇప్పుడు మళ్లీ సమ్మె కూడా తోడవ్వడంతో బ్యాంకింగ్​ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Published on: Jan 27, 2026, 07:31:15 IST
Advertisement

వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలన్న ఏళ్ల నాటి డిమాండ్‌ను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు నేడు, జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె వల్ల బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగవచ్చని ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారం అందించాయి.

నేడు బ్యాంకు సమ్మె- ప్రభావం ఎంత?

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె
నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె

ఈ బ్యాంకు సమ్మె వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు భారీ అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇప్పటికే గత మూడు రోజుల పాటు బ్యాంకులు పనిచేయలేదు. 24న నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడి ఉన్నాయి. ఇక సమ్మె కారణంగా ఈరోజు కూడా బ్యాంకులు పనిచేయకపోతే.. వరుసగా 4 రోజులు బ్యాంకింగ్​ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు అవుతుంది.

బ్యాంకు ఉద్యోగులు అన్ని వారాల్లోనూ ఐదు రోజుల పని విధానం ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం బ్యాంకు సిబ్బంది నెలకు రెండు శనివారాలు (రెండో, నాలుగో శనివారాలు) మాత్రమే సెలవు పొందుతున్నారు. మిగిలిన వారాల్లో ఆరు రోజులు పనిచేస్తున్నారు.

నేటి బ్యాంకు సమ్మె వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్, అడ్మినిస్ట్రేటివ్ పనులు స్తంభించిపోయే అవకాశం ఉంది. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేసినప్పటికీ, ఏటీఎంల్లో నగదు నింపే ప్రక్రియలో జాప్యం జరగడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

జనవరి 27న సమ్మెకు వెళుతున్నట్టు తొమ్మిది ప్రధాన బ్యాంకు ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాల కూటమి అయిన 'యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' (యూఎఫ్​బీయూ) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గత బుధ, గురువారాల్లో చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని పాత తరం ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులకు ఈ యూఎఫ్​బీయూకి ప్రాతినిధ్యం వహిస్తోంది.

అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలనే నిర్ణయంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యూఎఫ్​బీయూ మధ్య మార్చి 2024 వేతన సవరణ ఒప్పంద సమయంలోనే ఏకాభిప్రాయం కుదిరింది.

"మా న్యాయమైన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. వారానికి ఐదు రోజులు పనిచేసినా, అందుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాల పాటు పనిచేయడానికి మేము అంగీకరించాము. దీనివల్ల పని గంటల నష్టం ఉండదు," అని యూఎఫ్​బీయూ ఈ నెల ప్రారంభంలో పేర్కొంది.

ఆర్బీఐ, ఎల్‌ఐసీ, జీఐసీ, స్టాక్ మార్కెట్​లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే ఐదు రోజుల పని విధానాన్ని అనుసరిస్తున్నాయని, అలాంటప్పుడు బ్యాంకులు వెనుకబడి ఉండాల్సిన అవసరం లేదని యూఎఫ్​బీయూ అభిప్రాయపడుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe